Bethi Subhas Reddy: భూవివాదంతో నాకు సంబంధం లేదు

26 May, 2021 10:44 IST|Sakshi

ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి

హబ్సిగూడ: కాప్రా డివిజన్‌ పరిధిలోని సర్వే నంబరు 152, 153 లోని 23 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ స్థలం వివాదంలో తాను తలదూర్చి నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి అన్నారు. మంగళవారం హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుండటంతో కాప్రా తహసీల్దార్‌ గౌతంకుమార్‌ సూచనల మేరకు ఆక్రమణలకు గురికాకుండా చూశాం తప్పితే, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొన్నారు.

భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై గతంలో తహ సీల్దార్‌ ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయని చెప్పారు. సదరు కేసులున్న వ్యక్తులు కోర్టులో పిటిషన్లు వేసి, మాపై కేసులు పెట్టించడం దారుణ మన్నారు. ఎవరు భూములు ఆక్రమించారో, ఎవరు తప్పులు చేశారో త్వరలో ప్రభుత్వం నిగ్గు తేలుస్తుందని పేర్కొన్నారు.

ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాపాడడమే తమ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: భూ వివాదం: ఉప్పల్‌ ఎమ్మెల్యేపై కేసు

మరిన్ని వార్తలు