పాలమూరు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

17 Oct, 2020 13:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో జరిగిన ప్రమాదం చాలా దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 3.20లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిన్న పంపులు బ్లాస్ట్ అయ్యాయి. సీఎం కేసీఆర్ పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కల్వకుర్తికి 400 మీటర్ల దూరంలో పాలమూరు- రంగారెడ్డి చేపడితే ప్రమాదం ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని 2016 జూన్ 20న ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చింది.  (నీట మునిగిన ‘కేఎల్‌ఐ’ మోటార్లు) 

మేం ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పిన కేసీఆర్ పెడచెవిన పెట్టారు. మీరు కట్టే ప్రాజెక్టులకు నీళ్లు రావు. జేబుల్లోకి కమీషన్లు మాత్రమే వెళ్తాయి. కల్వకుర్తి ప్రమాదానికి బాధ్యత ఎవరిది..? ఇరిగేషన్ శాఖ సీఎం వద్దే ఉంది. వేల కోట్ల నష్టం వాటిల్లేలా చేసిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. దీని మీద జ్యుడిషియరీ కమిషన్ వేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అక్కడకు పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం' అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు