‘కేసీఆర్‌ను ఓడిస్తేనే అన్ని అమలు అవుతాయి’

24 Oct, 2020 15:47 IST|Sakshi

సాక్షి, దుబ్బాక: తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతకమ్మ పండుగ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆనందోత్సాహాలతో, సంప్రదాయ బద్దంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబ్బాకలో టీఆర్ఎస్‌ను ఒడిస్తే కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి. కేసీఆర్ మొక్కజొన్నలు మద్దతు ధరలకు కొంటామని, ఉద్యోగులకు డీఏ ఇస్తామని ప్రకటించడం దుబ్బాక ప్రజల నైతిక విజయం. మొన్నటి వరకు కుక్క తోక అంటూ ఉద్యోగులను అవహేళనగా మాట్లాడిన కేసీఆర్ నేడు డీఏ ప్రకటించారు. మొక్కజొన్న పంటలే వేయొద్దని 1200 రూపాయలకు క్వింటాలు  దేశమంతా దొరుకుతున్నయని మాట్లాడిన కేసీఆర్ నేడు గ్రామాలలో మీ దగ్గరే వచ్చి మొక్కజొన్నలు 1850 మద్దతు ధరకు కొంటామని అంటున్నారు. 

రైతులకు, ఉద్యోగులకు హామీలు అమలు చేసిన కేసీఆర్, మనం దుబ్బాకలో ఓడగొడితే ఇక అన్ని చేస్తారు. దళితులకు భూమి వస్తుంది, డబల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుంది.  ఆరోగ్య శ్రీ వస్తుంది. ఇంటికో ఉద్యోగం వస్తుంది, ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల్ వస్తాయి, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య వస్తుంది, అన్ని వస్తాయి. కేసీఆర్ దుబ్బాకలో ఓట్ల కోసమే రైతులకు, ఉద్యోగులకు మంచి చేస్తున్నట్లు నటిస్తున్నాడు. ఇక్కడ కార్‌ను గెలిపిస్తే మళ్ళీ లెక్కలు ఓట్లు అయ్యాక మోసం చేస్తారు. అదే ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజల కోపాన్ని చూసి అన్ని చేస్తారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు అవుతుంది. ఉద్యోగులకు ఇంకా రెండు డీఏలు ఇవ్వలేదు. పీఆర్‌సీ ఇవ్వలేదు. రైతులకు రుణ మాఫీ ఇవ్వలేదు. పంటలు పాడైతే నష్ట పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు రైతు బంధు రావాలి. అన్ని పంటలను గిట్టుబాటు ధరలకు కొనాలి. ఇవన్నీ అమలు కావాలంటే దుబ్బాకలో కార్‌ను ఓడించాలి. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ అంతటా ప్రజలకు న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. 

చదవండి: రైతుల ధర్నా.. దిగి వచ్చిన సర్కారు!

మరిన్ని వార్తలు