Hyderabad: రేపటి నుంచి వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ 

22 Aug, 2021 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో  కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌డ్రైవ్‌ ఈ నెల 23 నుంచి 10– 15 రోజులపాటు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహణపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 4,846 కాలనీ లు, మురికివాడలు తదితర ప్రాంతాలతో పాటు కంటోన్మెంట్‌ పరిధిలోని 360 ప్రాంతాల్లో స్పెషల్‌డ్రైవ్‌ కొనసాగుతుందన్నారు. వందశాతం కోవిడ్‌ టీకాలు వేసిన నగరంగా హైదరాబాద్‌ను మార్చడం  దీని లక్ష్యమని పేర్కొన్నారు.

టీకాలు వేసేందుకు జీహెచ్‌ఎంసీలో 150, కంటోన్మెంట్‌ ఏరియాలో 25 వాహనాలు వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనంలో ఇద్దరు టీకా వేసే సిబ్బంది,  ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉంటారన్నారు. ప్రతి కాలనీలో ఇద్దరు వ్యక్తులతో కూడిన మొబిలైజేషన్‌ టీమ్స్‌ టీకాలు తీసుకోని వారిని ముందుగానే  గుర్తించి, వ్యాక్సిన్‌ వేసే తేదీ, సమయాన్ని తెలియజేయడంతో పాటు టీకా వేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుందన్నారు.

సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్, కంటోన్మెంట్‌ బోర్డు సీఈఓ అజిత్‌ రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్‌డీ డాక్టర్‌ గంగాధర్‌ పాల్గొన్నారు. వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ పర్యవేక్షణకు జీహెచ్‌ఎంసీలోని 12 సర్కిళ్లకు 12 మంది  జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను నోడల్‌ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.  

చదవండి: King Cobra: 13 అడుగుల గిరినాగు

మరిన్ని వార్తలు