ఇక తిరుపతికి ఎనిమిదిన్నర గంటల్లోనే.. వేగంగా వెళ్లేందుకే ఆ మార్గం ఎంపిక.. 

2 Apr, 2023 07:29 IST|Sakshi

వారంలో అందుబాటులోకి 

సికింద్రాబాద్‌లో ఉదయం 6కి బయలుదేరి మధ్యాహ్నం రెండున్నరకల్లా తిరుపతికి 

8న ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో ఆగనున్న రైలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి రైలు ప్రయాణాలకు పడుతున్న 12 గంటల సమయాన్ని ఎనిమిదిన్నర గంటలకు కుదిస్తూ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దూసుకొస్తోంది. ఈ నెల 8న సికింద్రాబాద్‌లో ప్రధాని మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య ఓ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సంక్రాంతి రోజున ప్రారంభమై విజయవంతంగా సేవలందిస్తుండగా ఇప్పుడు దక్షిణమధ్య రైల్వేకు రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రాబోతోంది. మొదటి రైలును ప్రధాని స్వయంగా వచ్చి ప్రారంభించాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రాలేకపోయారు.

ఇప్పుడు రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు ఆయన నగరానికి రానున్నారు. దాంతోపాటు నగరంలో ఎంఎంటీఎస్‌ రెండో దశకు సంబంధించి ఫలక్‌నుమా–ఉందా నగర్, సికింద్రాబాద్‌–మేడ్చల్‌ సరీ్వసులను కూడా ప్రారంభించనున్నారు. అలాగే సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ మధ్య పూర్తయిన డబ్లింగ్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఉదయం బయలుదేరి మధ్యాహ్నానికి తిరుపతికి.. 
ప్రస్తుతం రాష్ట్రం నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం 8 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వెంకటాద్రి, నారాయణాద్రి, సెవెన్‌హిల్స్, పద్మావతి, రాయలసీమ, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లతోపా టు ఢిల్లీ–తిరుపతి మధ్య నడిచే ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ ప్రెస్, సికింద్రాబాద్‌ నుంచి తిరువనంతపురం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌లు తిరుమల యాత్రికులకు సేవలందిస్తున్నాయి. గతంలో కొంతకాలం డబుల్‌ డెక్కర్‌ రైలు నడిచినా ప్రయాణికుల ఆదరణ అతితక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు నగరం నుంచి తిరుపతికి తొమ్మిదో రైలుగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం అవుతోంది. 

మిగతా రైళ్లు నగరం నుంచి తిరుపతికి వెళ్లేందుకు సగటున 12 గంటల సమయం తీసుకుంటున్నాయి. కానీ ఈ రైలు కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే గమ్యానికి చేరుకోనుండటం విశేషం. ప్రస్తుతానికి తాత్కాలికంగా రైల్వే అధికారులు పేర్కొంటున్న వేళల ప్రకారం ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకల్లా తిరుపతికి చేరుకుంటుంది. ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే కృష్ణా (ఆదిలాబాద్‌లో రాత్రి బయలుదేరి) ఎక్స్‌ప్రెస్‌ తిరుపతికి వెళ్లేసరికి రాత్రి పదిన్నర దాటుతోంది. ఈ నేపథ్యంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

వేగంగా వెళ్లేందుకే ఆ మార్గం ఎంపిక.. 
కొత్త వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరు పతి వెళ్లనుంది. వందేభారత్‌ రైళ్ల వేగం ఎక్కువగా ఉండనున్నందున, 130 కి.మీ. వేగాన్ని తట్టుకొనేలా పటిష్టం చేసిన ట్రాక్‌నే కేటాయిస్తున్నారు. ఆ తరహా ట్రాక్‌ ప్రస్తుతం తిరుపతి మార్గంలో ఇదొక్కటే. దీంతో ఆ మార్గాన్ని ఎంపిక చేశారు. అయితే బీబీనగర్‌–నడికుడి మధ్య ఉన్నది కేవలం బ్రాంచి లైనే. అది కూడా సింగిల్‌ లైన్‌. దీన్ని 130 కి.మీ. వేగానికి పటిష్టం చేయలేదు. దాదాపు 175 కి.మీ. మేర ఉన్న ఈ మార్గంలో మాత్రం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నెమ్మదిగా వెళ్లాల్సిందే. గుంటూరు–తెనాలి మధ్య ఉన్నది కూడా బ్రాంచి లైనే. ఈ ట్రాక్‌ సామర్థ్యాన్ని సైతం పెంచలేదు. అయితే ఇటీవలే సింగిల్‌ లైన్‌ను డబుల్‌ లైన్‌గా మార్చారు. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు గంటకు 160 కి.మీ. నుంచి 200 కి.మీ. వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉన్నా మన ట్రాక్‌ పరిస్థితి, మలుపుల దృష్ట్యా సగటున గంటకు 77 కి.మీ. వేగంతోనే ఈ రైలు ప్రయాణించనుంది. 

తక్కువ కోచ్‌లే.. 
విశాఖకు నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లు ఉండగా తిరుపతి రైలులో ఆ సంఖ్య 9 లేదా 10గా ఉండనున్నట్లు సమాచారం. ఈ రైలు టికెట్‌ ధర ఎక్కువగా ఉండ నున్నందున అంత మొత్తాన్ని భరించలేనివారు ఇతర రైళ్లవే పే మొగ్గుచూపుతారన్న ఉద్దేశంతో తొలుత తక్కువ కోచ్‌లతోనే రైలును నడపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. రద్దీ ఎక్కువగా ఉంటే, తర్వాత కోచ్‌ల సంఖ్య పెంచనున్నట్టు సమాచారం. ఈ రైలు గుంటూరులో 5 నిమిషాలు, మిగతా చోట్ల నిమిషం చొప్పున మాత్రమే ఆగుతుంది. అ యితే ఈ నెల 8న ప్రారం¿ోత్సవం రోజున సాధారణ ప్ర యాణికులను అనుమతించరు. ఆ రోజు సికింద్రాబాద్‌లో ఉదయం 11:30కు బయలుదేరుతుందని సమాచారం.

>
మరిన్ని వార్తలు