హైకోర్టు అనుమతిచ్చినా వీరహనుమాన్ విజయ యాత్రకు బ్రేక్‌

27 Apr, 2021 20:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హనుమజ్జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరగాల్సిన  వీరహనుమాన్ విజయ యాత్రకు అకస్మాత్తుగా బ్రేక్‌ పడింది. హైకోర్టు యాత్రకు అనుమతిచ్చినా కూడా యాత్ర ఆగిపోయింది. అయితే యాత్రను తామే స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు హిందూ సంఘాలు ప్రకటించాయి. వాస్తవంగా హైదరాబాద్‌లో మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా పాతబస్తీ నుంచి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభయాత్ర జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు. 

అయితే న్యాయస్థానాలు ఎన్నో ఆంక్షలతో  వీరహనుమాన్ విజయ యాత్రకు అనుమతిచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పక్కాగా నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో భజరంగ్‌దల్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంఘాలు యాత్రపై సమాలోచనలు చేశాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో యాత్ర విరమించుకుంటే మంచిదనే అభిప్రాయానికి ఆయా సంస్థలు వచ్చాయి. చివరకు వీరహనుమాన్ విజయ యాత్రను స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ప్రతినిధులు బండారి రమేశ్‌, రామరాజు, సుభాశ్‌ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం కరోనా నియమాలు మత రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

చదవండి: ఈ హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది.. చిరంజీవి
చదవండి: గుడ్‌న్యూస్‌.. 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం

మరిన్ని వార్తలు