September 17: విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు: వెంకయ్య నాయుడు

17 Sep, 2022 08:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సెప్టెంబర్‌ 17పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి విమోచన దినోత్సవ వేడుకల కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు.. శనివారం ఉదయం విమోచన దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌ వద్ద మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌.. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అఖండ దేశభక్తుడు. దేశ సమైక్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు. కులమతాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం ముందుకెళ్లాలి. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్‌కు స్వాతంత్రం వచ్చింది అని అన్నారు. 

ఇదిలా ఉండగా.. బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ బీజేపీ కార్యాలయంలో జాతీయజెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సునీల్‌ బస్సల్‌, తరుణ్‌చుగ్‌, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. 

మరిన్ని వార్తలు