సిద్దిపేట కలెక్టర్‌గా మళ్లీ వెంకట్రామిరెడ్డి

14 Nov, 2020 03:35 IST|Sakshi

మెదక్‌ జిల్లా బాధ్యతలు కూడా అప్పగింత

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పి.వెంకట రామిరెడ్డి మళ్లీ నియమితులయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ను సిద్దిపేట జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు గత నెలలో బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తి కావడంతో ఆయనను సిద్దిపేట కలెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

ఎన్నికలకు ముందు మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా వెళ్లిన సంగారెడ్డి కలెక్టర్‌ ఎం.హన్మంతరావును మళ్లీ సంగారెడ్డికి బదిలీ చేశారు. ఎన్నికలకు ముందు సిద్దిపేట కలెక్టర్‌గా స్థానచలనం పొందిన మంచిర్యాల కలెక్టర్‌ భారతి హోళికెరిని తిరిగి మంచిర్యాలకు బదిలీ చేశారు. మంచిర్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నుంచి సిక్తా పట్నాయక్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు. పెద్దపల్లి కలెక్టర్‌గా అదనపు బాధ్యతల నుంచి శశాంకను రిలీవ్‌ చేస్తూ ఆమె స్థానంలో హోళికెరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మేడ్చెల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతికి ఆ జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు.  

మరిన్ని వార్తలు