గిరిజనుల పాలిట దేవుడు అల్లూరి సీతారామరాజు

3 Jan, 2022 02:34 IST|Sakshi

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఏడాది పొడవునా

అల్లూరి జయంతి ఉత్సవాలు

‘అమృత్‌’ఉత్సవాల్లో భాగంగా నిర్వహణ.. ఎఫ్‌ఎన్‌సీసీలో ఘనంగా అల్లూరి 125వ జయంతి వేడుకలు

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): తన వీరోచిత పోరా టాలతో తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించి గిరిజనుల పాలిట దేవుడిగా, ప్రజల్లో దేశ భక్తిని నింపిన స్వాతంత్య్ర సమరయోధుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్ర చిరస్థాయిలో నిలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రముఖుల జీవి తాలను ఈ తరానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని జాతీయ సంబురాలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఆదివారం ఫిలింనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లా డుతూ.. ఈ ఏడాది జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలను నిర్వహించాలన్నారు. ఏపీలోని లంబసింగిలో అల్లూరి మ్యూజియానికి రూ.35 కోట్లు కేటాయిం చామని, అందులో ఇప్పటికే రూ. 6.93 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాల్లోనే మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అల్లూరిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, దానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నామని చెప్పారు. సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారానే ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలిసిందని, తాను ఆ సినిమాను 20 సార్లు చూశానని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 

పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలి: ఏపీ మంత్రి అవంతి
ఏపీ పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసే విధంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషి చేయాలని కోరారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఒక జిల్లాకు అల్లూరి పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అల్లూరి పేరుతో విశ్వవిద్యాలయాల్లో గోల్డ్‌ మెడల్స్‌ను ప్రవేశ పెట్టాలన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ.. తన పన్నెండో ఏట నుంచే అల్లూరి అంటే ఇష్టమని.. తన వందో చిత్రం అల్లూరి సీతారామరాజు.. అని గుర్తు చేసుకున్నారు.

తాను 365 సినిమాలలో నటించినా ఇప్పటికీ తనకు నంబర్‌ వన్‌ చిత్రం అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, హీరో మోహన్‌బాబు మాట్లాడుతూ.. రాజులు చాలా గొప్పవారని, వాళ్లల్లో రాజకీయం నరనరాల్లో ప్రవహిస్తూ ఉంటుందని అన్నారు. రాజులంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు ఎన్‌.నాగరాజు, ప్రధాన కార్యదర్శి పి.నానిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో కృష్ణను సత్కరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు.

మరిన్ని వార్తలు