వ్యాక్సినేషన్‌ ప్రజా ఉద్యమంలా రూపొందాలి 

8 Sep, 2021 05:32 IST|Sakshi
కోవిడ్‌ టీకా పంపిణీని ప్రారంభిస్తున్న వెంకయ్యనాయుడు  

టీకాపై అపోహలు వీడాలి 

స్వర్ణ భారత్‌ ట్రస్టు ఉచిత టీకాల పంపిణీ ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

శంషాబాద్‌ రూరల్‌: కరోనాపై పోరాడేందుకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే ప్రత్యామ్నాయమని, వ్యాక్సినేషన్‌ ప్రజా ఉద్యమంలా రూపుదాల్చాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణ భారత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీల్లో మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కోవాగ్జిన్‌ ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని ముచ్చింతల్‌ సమీపంలో ఉన్న ట్రస్టు ఆవరణలో వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు వీడాలని కోరారు. 

దేశీయంగా తయారీతో తగ్గిన ఖర్చు: దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా అన్ని ప్రాంతాలకు టీకాలు అందించే వీలుంటుందని భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్లా అన్నారు. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లోని కేంద్రాల నుంచి కోవాగ్జిన్‌ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉష  పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు