Ganesh Chaturthi 2022: హైదరాబాద్‌లో గణేష్‌.. జోష్‌

31 Aug, 2022 01:36 IST|Sakshi
పూజలకు సిద్ధమైన ఖైరతాబాద్‌ మహాగణపతి 

సాక్షి, హైదరాబాద్‌: భక్తకోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య మరికొద్ది గంటల్లో  కొలువుదీరేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల కోసం నగరం శోభాయమానమైంది. వినాయక చవితి వేడుకలకు మండపాలు అందంగా ముస్తాబవుతున్నాయి. మహానగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మరోవైపు వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల  కొనుగోళ్లతో  మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ప్రధాన రహ దారులకు  ఇరువైపులా  అమ్మకాలతో సందడి నెలకొంది.

పర్యావరణహిత మట్టి ప్రతిమల పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ లాంటి ప్రభుత్వ  విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే లక్షలాది విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాయి. ధూల్‌పేట్, ఉప్పల్, ఎల్‌బీనగర్, నాగోల్, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల అమ్మ కాలు మంగళవారంఆఖరి రోజు జోరుగా సాగాయి. విగ్రహాల తరలింపు, పూలు, పండ్లు, పూజావస్తువుల కొనుగోళ్ల కోసం జనం పెద్ద ఎత్తున  రహదారులపైకి చేరడంతో నగరంలోని అనేక చోట్ల మంగళవారం ఉదయం నుంచే  ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది.  

వైవిధ్యమూర్తులు..  
వైవిధ్యభరితమైన  విగ్రహమూర్తులు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ స్ఫూర్తిని  ప్రతిబింబించే  విగ్రహాలు, మహాభారత్‌ వినాయకుడు, అర్ధనారీశ్వరుడి  సమక్షంలో కొలువైన బొజ్జ గణపయ్య, అంగరక్షకులు, సేవకుల సమక్షంలో మందిరంలో కొలువైన దేవదేవుడు, షిరిడీ సాయిబాబా ఆకృతిలో, ముంబై గణేశుడిగా.. ఇలా అనేక రకాల  రూపాల్లో  కొలువైన వినాయకుడు నవరాత్రి ఉత్సవాలకు సిద్ధంగా ఉన్నాడు. బహు ముఖ వినాయకుడు మరో ప్రత్యేక ఆకర్షణ. భక్తుల మదిని దోచే  వివిధ రకాల భంగిమలు, ఆకృతు లతో, చక్కటి  రంగులతో   అద్భుతంగా  తీర్చిదిద్దిన విగ్రహాలు  ఇప్పటికే మండపాలకు చేరుకు న్నాయి. గ్రేటర్‌ పరిధిలో సుమారు 50 వేలకు పైగా మండపాల్లో నవరాత్రి  వేడుకలు జరగనున్నాయి.  

సందడిగా మార్కెట్లు.. ధరలకు రెక్కలు 
వినాయక చవితి సందర్భంగా  పూజ కోసం వినియోగించే 21 రకాల పత్రి, బంతిపూలు,మామిడి ఆకులు, మారేడు కాయల అమ్మకాలతో  మార్కెట్‌లలో సందడి నెలకొంది. పండుగ సందర్భంగా పూల  ధరలు  ఒక్కసారిగా పెరిగాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లలో బంతిపూలు కిలో రూ.70 వరకు ఉంటే  పూల దుకాణాల వద్ద కిలో రూ.150 వరకు విక్రయించారు. బుధవారం ఒక్క రోజే సుమారు 21 టన్నులకు పైగా బంతి పూల విక్రయాలు జరిగినట్లు మార్కెట్‌ వర్గాల అంచనా.

చామంతి పూలు హోల్‌సేల్‌గా  కిలో రూ. 170 వరకు ఉంటే రిటైల్‌గా  రూ.250 వరకు అమ్మారు. అలాగే గులాబీ, కనకాంబరాల ధరలు సైతం భారీగా పెరిగాయి. సెంట్‌ గులాబీలు హోల్‌సేల్‌ మార్కెట్‌లో రూ.200 కిలో చొప్పున, కనకాంబరాలు రూ.1000కి కిలో చొప్పున  విక్రయించారు.  

పూల మార్కెట్‌ కిటకిట 
గోల్కొండ: వినాయక చవితిని పురస్కరించుకుని పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.  గుడిమల్కాపూర్‌లోని పి.ఇంద్రారెడ్డి పూల మార్కెట్‌ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తడి, పొడి పూలు అంటూ విడివిడిగా బంతి, చామంతులను విక్రయించారు. ఒక్కరోజే మార్కెట్‌కు వంద వాహనాల్లో రికార్డుస్థాయిలో బంతిపూలు వచ్చాయని వర్తకుల సంఘం ప్రతినిధి దేవర శ్రీనివాస్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు