ఒకే దేశం.. ఒకే చట్టం... మరి ఇదెక్కడి న్యాయం !

27 Jun, 2021 10:32 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి

జమ్మూకశ్మీర్‌లో మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచాలనుకోవడం సరికాదు

రాజ్యాంగ సవరణ అంశం జమ్మూకశ్మీర్‌కు వర్తించదా? 

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌  బి. వినోద్‌కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభించాలని, తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు జమ్మూకశ్మీర్‌లో మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచాలని ప్రయత్నించడం, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఆక్షేపణీయమని అన్నారు.

అక్కడెలా పెంచుతారు
హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో జూన్‌ 26 శనివారం వినోద్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ‘తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని, అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాని మోదీ బదులిచ్చారు. మరి ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ అంశం జమ్మూ కశ్మీర్‌కు వర్తించదా?’అని వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. ఒకే దేశం... ఒకే చట్టం అంటే ఇదేనా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలన్నారు. 
 

చదవండి : కశ్మీరీల్లో అపనమ్మకాన్ని తొలగించాలి

మరిన్ని వార్తలు