సీఐ చాంబర్‌లో కాలుతో తన్ని.. బూతులు తిట్టిన బీజేపీ నేత’

8 May, 2021 14:50 IST|Sakshi

కాలుతో తన్ని.. దుర్భాషలాడిన నాయకుడు

సీఐ చాంబర్‌లో ఘటన

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాలు

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో గిరిజనుడిని మాడ్గుల సీఐ పోలీస్‌ స్టేషన్‌లో విచారణ చేస్తుండగా.. అక్కడే ఉన్న బీజేపీ నాయకుడు ఆ గిరిజనుడిని కాలుతో తన్నిన దృశ్యాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మాడ్గుల మండలం ఇరి్వన్‌ పంచాయతీ పరిధిలోని గాంగ్యానగర్‌తండాకు చెందిన వడ్త్యావత్‌ శంకర్‌(28) ఏప్రిల్‌ 19న హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై మాడ్గుల సీఐ ఉపేందర్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సీఐ చౌటకుంట తండాకు చెందిన ప్రత్యక్ష సాక్షిగా భావించిన మేరావత్‌ పాండు అనే వ్యక్తిని ఇటీవల పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తన ఛాంబర్‌లో మాజీ ప్రజాప్రతినిధి, మరో బీజేపీ నాయకుడి ముందు విచారణ చేపట్టారు.

విచారణ సమయంలో కుర్చీలో కూర్చున్న బీజేపీ నాయకుడు.. విచారణ ఎదుర్కొంటున్న పాండును వెనక నుంచి కాలుతో తన్నుతూ అసభ్యకరంగా దూషించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా మాడ్గుల పోలీస్‌ స్టేషన్‌లో మేరావత్‌ పాండును కాలితో తన్ని బూతులు తిట్టిన బీజేపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు నేనావత్‌ హన్మానాయక్‌రాథోడ్‌ శుక్రవారం డిమాండ్‌ చేశారు. 

నేను గమనించలేదు: సీఐ 
పాండును బీజేపీ నాయకుడు తన చాంబర్‌లో తన్నినట్లు తాను గమనించలేదని సీఐ ఉపేందర్‌రావు చెప్పారు. దీనిపై పాండు ఫిర్యాదు చేస్తే సదరు నాయకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.

చదవండి: దేవరయాంజల్‌: పేపర్‌ వార్తల ఆధారంగా జీవోలు ఇస్తారా?

మరిన్ని వార్తలు