తెరపైకి వర్చువల్‌ ఆడియో సినిమాలు

3 Oct, 2020 06:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అందరికీ వినోదం పంచే ‘సినిమా’ కాలానుగుణంగా తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంది. నాటి బ్లాక్‌ అండ్‌ వైట్, మూకీ సినిమాలు మొదలు ప్రస్తుత త్రీడీ, యానిమేటెడ్‌ మూవీస్‌ వరకు కొత్తదనాన్ని, నూతన సాంకేతికతను తనలో కలుపుకుంటూనే ఉంది. సినిమాని కేరీర్‌గా ఎంచుకునే యువతరం పెరగడంతో షార్ట్‌ఫిల్మ్‌ హవా కూడా పెరిగింది. పొట్టి ఫ్లాట్‌ఫార్మ్‌పై తమదైన ముద్ర వేయాలనే తపనతో యువత కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అదే క్రమంలో వినూత్న వర్చువల్‌ ఆడియో ఫిల్మ్‌ తెరపైకి వచ్చింది. ప్రయోగాలకు వెనుకంజ వేయని నగర యువతను తన వైపు ఆకర్షిస్తోంది.. ఈ తరహా
ఫిల్మ్‌లపై దృష్టి పెట్టేందుకు లాక్‌డౌన్‌ టైమ్‌ వారికి ఉపయోగపడింది. 

వర్చువల్‌ ఆడియో ఫిల్మ్‌ అంటే.. 
వినడానికి కొత్తగా ఉన్న వర్చువల్‌ ఆడియో ఫిల్మ్‌ నిజానికి వినడం మాత్రమే చేయగలం. ఈ చిత్రం.. చూసేందుకు మాత్రం వినూత్నంగా ఉంటుంది. అందరికీ తెలిసిన షార్ట్‌ ఫిల్మŠస్‌ అంటే ఆర్టిస్ట్‌లు, క్యాస్టూమ్స్, లొకేషన్స్, పాటలు, ఫైట్లు..! ఇవి లేకుండా ఏ సినిమానీ ఊహించుకోలేరు. కానీ వర్చువల్‌ ఆడియో ఫిల్మ్‌లో ఇవేవి కనపడవు. కానీ వినపడతాయి. ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో ప్రత్యేకతే అది. ఒక సన్నివేశాన్ని, సందర్భాన్ని తెరపైన కనపడకుండా కేవలం మాటలు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్, సౌండ్‌ ఎఫెక్ట్స్‌తోనే కళ్లకు కట్టినట్టు కథ చూపించడం, వినిపించడం దీనిలో విశేషం.  

ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి ‘డార్క్‌’ మూవీ.. 
‘ఎ డేట్‌ ఇన్‌ ద డార్క్‌’ పేరుతో నగరవాసి సింగార మోహన్‌ ఒక వర్చువల్‌ ఆడియో ఫిల్మ్‌ని రూపొందించారు. ఆద్యంతం చీకటిలోనే నడిచే సున్నితమైన ప్రేమకథ ఇది. సినిమా దర్శకుడిగా మారాలనే ఆశయంతో వచ్చిన మోహన్‌ మొదటి ప్రయత్నంగా ఈ షార్ట్‌ మూవీని రూపొందించాడు. దర్శకుడిగా నిరూపించుకోవాలంటే విభిన్నమైన సినిమాని చేయాలన్న ఆలోచనతో ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమాకి సోషల్‌ మీడియాలో మంచి ఆదరణ అభించింది. ఇప్పటి వరకు 6 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి ఎంపిక కాగా అందులో రెండింటిలో ఫైనల్‌ లిస్ట్‌లో
కొనసాగుతుంది. 

తక్కువ ఖర్చుతో ప్రయోగం.. 

  • కనపడకుండా కేవలం వినపడటం ద్వారా ఓ చిత్రాన్ని పొయెటిక్‌గా రూపొందించడం. అంత సులభం కానప్పటికీ హత్తుకునే కథా, కథనం సన్నివేశాన్ని మాటలతోనే ఆసక్తి రేకించే పనితనం అన్నింటికీ మించి మానసిక స్పందనలను ప్రభావితం చేయగల నేర్పరితనంఉంటే ఈ చిత్రం ‘చెవుల్ని’ కట్టి పడేస్తుంది.  
  • ఈ మూవీలో నటీనటుల మాటలు, వారి చుట్టూ ఉన్న పరిసరాల్లోని సౌండ్స్‌ మాత్రమే ఉంటాయి. వీటి ద్వారానే జరుగుతున్న సన్నివేశాన్ని కనపడకుండా చూపించగలగాలి.  
  • ఒక సీన్‌ నుంచి ప్రేక్షకుడి ధ్యాస మరల్చకుండా తీయగలగాలి. అతితక్కువ ఖర్చుతో ఈ సినిమా తీసే అవకాశం ఉంది. మేకప్,కాస్టూమ్స్, ట్రావెలింగ్‌ తదితర ఖర్చులేమి ఉండవు.
  • ఈ విధమైన సినిమాలు ఇంతకు ముందు తీసిన సందర్భాలు చాలా అరుదు. సినిమాలో కొత్తదనం కోరుకునే కొందరు దర్శకులు మాత్రం వీటికి సై అంటున్నారు.  

రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు.. 
ఈ షార్ట్‌ఫిల్మ్‌ గురుంచి మోహన్‌ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్‌ తీయాలని ఇష్టం. అందుకే స్వచ్ఛమైన ప్రేమ కథతో ఈ సినిమా తీశాను.  కంటికి కనపడకుండా ఒక అనుభూతిని ప్రేక్షకుడికి అందించాలంటే స్క్రిప్ట్‌ ఎంతో ముఖ్యం. దాన్ని అనుకున్నట్టుగా తీయడం చాలా కష్టం. మన దగ్గర అతి తక్కువ మంది ఈ విధమైన సినిమాలు తీశారు. వర్చువల్‌ ఆడియో ద్వారా దేశంలోనే మొదటి సారిగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తీసిన ‘డైలాగ్‌ ఇన్‌ ద డార్క్‌’ నా సినిమాకు ప్రేరణ. 11 నిమిషాల సినిమా నిర్మించడానికి దాదాపు 40 రోజులు శ్రమించామన్నారు.  

పాటకు డిజిటిల్‌ ప్లాట్‌ఫామ్‌
సాక్షి, హైదరాబాద్‌: మనమంతా.. మనసంతా.. ఆన్‌లైన్‌పైనే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పండుగైనా, పబ్బమైనా, ఆటలైనా, పోటీలైనా.. ఆన్‌లైన్‌ను ఆశ్రయించాల్సిందే. కరోనా తనతో పాటు డిజిటల్‌ వాడకాన్ని కూడా బాగా వ్యాప్తిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే క్రమంలో పాటల పోటీలను కూడా డిజిటల్‌ పంథాలో తొలిసారిగా తెలుగు డిజిటల్‌ ఐడల్‌ పోటీలను నిర్వహిస్తోంది సిటీకి చెందిన టెంపుల్‌ బెల్‌ ఈవెంట్స్‌. ఈ పోటీ నిర్వాహకులు కౌశిక్‌ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. 

దివంగత గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం టీవీ తెర వేదికగా ఎందరో గాయనీ గాయకులను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం మనకు తెలియంది కాదు. ఆయన స్ఫూర్తితో ఎన్నో పాటల పోటీలకు బీజం పడింది. ఓ ఏడెనిమిది నెలల క్రితం వరకూ మనకు టీవీ షోల రూపంలోగానీ, బయట గానీ అనునిత్యం ఎక్కడో ఒకచోట పాటల పోటీలు జరుగుతూనే ఉండేవి. అయితే కరోనా కారణంగా అన్నింటితో పాటు అవీ అరకొరగానే మారిపోయాయి. ఆన్‌లైన్‌ కార్యకలపాలు తప్పనిసరిగా మారిన ప్రస్తుత పరిస్థితి వల్ల డిజిటల్‌ వేదికను ఉపయోగించుకుని పాటల పోటీ నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నచ్చిన తానా అధ్యక్షులు జె.తళ్లూరి కూడా నిర్వహణలో చేయి కలిపారు.  

సాంగు భళా.. పోటీ ఇలా.. 
ఈ పోటీల పోస్టర్‌ను ఆగస్టు 11న సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్‌ ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పోటీదారుల రిజిస్టర్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 550 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాల నుంచి కూడా పోటీదారులు ఉన్నారు. వీరి నుంచి వడపోత అనంతరం 30 మందిని ఎంపిక చేశాం. తొలి రౌండ్‌లో ఈ 30 మంది పాల్గొంటారు. అదేవిధంగా 9 మంది క్వార్టర్‌ ఫైనల్స్‌కి, ఐదుగురు సెమీఫైనల్స్‌కి సెలక్టవుతారు. తుది పోటీకి ముగ్గురు మాత్రమే అర్హత పొందుతారు. ఈ పోటీలో ప్రతి దశా పూర్తిగా వర్చువల్‌గానే జరుగుతుంది.  

సాంగు భళా.. పోటీ ఇలా..
ఈ పోటీల పోస్టర్‌ను ఆగస్టు 11న సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్‌ ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పోటీదారుల రిజిస్టర్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 550 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాల నుంచి కూడా పోటీదారులు ఉన్నారు. వీరి నుంచి వడపోత అనంతరం 30 మందిని ఎంపిక చేశాం. తొలి రౌండ్‌లో ఈ 30 మంది పాల్గొంటారు. అదేవిధంగా 9 మంది క్వార్టర్‌ ఫైనల్స్‌కి, ఐదుగురు సెమీఫైనల్స్‌కి సెలక్టవుతారు. తుది పోటీకి ముగ్గురు మాత్రమే అర్హత పొందుతారు. ఈ పోటీలో ప్రతి దశా పూర్తిగా వర్చువల్‌గానే జరుగుతుంది.   

మరిన్ని వార్తలు