సేవకు గుర్తింపు....

4 Aug, 2020 06:33 IST|Sakshi
అవార్డు అందుకున్న గోపీనాథ్‌ , గాయని పద్మశ్రీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విపత్తులో సామాన్య జనానికి పలు సేవా కార్యక్రామాలు అందించినందుకుగాను సీనియర్‌ సబ్‌ ఎడిటర్, సామాజిక కార్యకర్త టి.గోపీనాథ్‌ను ‘విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌’ సంస్థ ‘కరోనా వారియర్‌ ఇంటర్నేషనల్‌ హానర్‌’ పేరుతో సత్కరించింది. కోవిడ్‌ కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పేదవారిని గుర్తించి వారికి నిత్యావసరాలు అందించడమేగాక, అలాంటి వారి ఉనికి వెలికి తీసి మరిన్ని సంస్థల సహకారం అందేలా గోపినాథ్‌ కృషి చేశారు. ఈ మేరకు ‘విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌’ సంస్థ ఆయనకు సర్టిఫికెట్‌ ప్రదానం చేసింది. సాక్షి టీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ నేమాని భాస్కర్‌ ఈ మేరకు గోపీనాథ్‌ను అభినందించారు. తనకు అందిన పురస్కారం తాను మరిన్ని సేవాకార్యక్రమాలు చేసేందుకు బలాన్నిచ్చిందని గోపీనాథ్‌ పేర్కొన్నారు. 

గాయని పద్మశ్రీ త్యాగరాజుకు..  
సుల్తాన్‌బజార్‌: ప్రఖ్యాత గాయని పద్మశ్రీ త్యాగరాజుకు విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ వారు ‘కరోనా వారియర్‌ ఇంటర్నేషనల్‌ హానర్‌’ అవార్డును అందించారు. కరోనా కాలంలో పద్మశ్రీ త్యాగరాజు ‘కోవిడ్‌–19 మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ శీర్షికన ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 100 పాటలు స్వయంగా పాడి రోజుకో పాట చొప్పున ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ తన గానం ద్వారా అందరినీ ఆనందపరిచారు. కరోనా కాలంలో ఆమె చేసిన కృషిని గుర్తించి ‘విశ్వగురు’ ఎండీ సత్యవోలు రాంబాబు స్వయంగా పద్మశ్రీ త్యాగరాజుకు అవార్డు ప్రదానం చేశారు.  

మరిన్ని వార్తలు