వరంగల్‌ ఆయుర్వేద వైద్య కళాశాలలో అడ్మిషన్లు రద్దు! 

27 Oct, 2022 01:04 IST|Sakshi

ఆదేశాలు జారీ చేసిన ఎన్‌సీఐఎస్‌ఎం 

అధ్యాపకులు, సిబ్బంది కొరతే కారణం.. 63 సీట్లు కోల్పోనున్న విద్యార్థులు 

కాశిబుగ్గ: వరంగల్‌ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాలలో 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు రద్దయినట్లు తెలిసింది. కళాశాలలో అధ్యాపకులు, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమి కారణంగా నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌(ఎన్‌సీఐఎస్‌ఎం) రద్దు చేసినట్లు సమాచారం. 2022 ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీలోని ఎన్‌సీఐఎస్‌ఎం.. వైద్య కళాశాలతోపాటు కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రిలో ఆన్‌లైన్‌లో తనిఖీలు చేసింది.

కళాశాల, వైద్యశాలలో సరిపోను బోధన సిబ్బంది, వైద్యులు, బోధనేతర సిబ్బంది, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, కళాశాలకు వెబ్‌సైట్, ల్యాబొరేటరీలో కనీస సౌకర్యాలు, పరికరాలు లేకపోవడాన్ని బృందం గుర్తించింది. అధ్యాపకులు, సిబ్బందిని నియమించాలని స్థానిక అధికారులు ప్రభు త్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదని తెలిసింది. కళాశాలను పార్ట్‌టైం అధ్యాపకు లు, సిబ్బందితో నిర్వహిస్తున్నట్లుగా గుర్తించిన ఎన్‌సీఐఎస్‌ఎం సీట్లను రద్దు చేస్తున్నట్లు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనట్లు తెలిసింది. అడ్మిషన్ల రద్దుతో తెలంగాణలోని 63 మంది విద్యార్థులు వైద్యులుగా అయ్యే అవకాశాలు కోల్పోనున్నారు. 

రిక్రూట్‌మెంట్‌ లేక ఖాళీలు
2011 నుంచి అ«ధ్యాపకులు, వైద్యశాలలో డాక్టర్లు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో రాష్ట్రంలోని రెండు ఆయుర్వేద వైద్య కళాశాలల్లో అధ్యాపకులు, వైద్యుల పోస్టులు ఖాళీలు ఉండటంతో సిలబస్‌ పూర్తికావడం లేదని, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలని విద్యార్థులు పలుమార్లు కళాశాలల్లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పీజీ పూర్తి చేసిన విద్యార్థులను పార్ట్‌టైం లెక్చరర్లుగా నియమించినా వేతనాలు చెల్లించకపోవడంతో  బోధించడం లేదు.    

మరిన్ని వార్తలు