మాకు సీట్లు ఇప్పించండి..

9 Jul, 2022 00:34 IST|Sakshi
యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులు  

కాళోజీ ఆరోగ్య వర్సిటీ మెడికల్‌ కాలేజీల విద్యార్థుల ఆందోళన

ఎన్‌ఎంసీ ఆదేశాల మేరకు త్వరగా సీట్లు పునరుద్ధరించాలని డిమాండ్‌

ఎంజీఎం: రాష్ట్రంలో జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ ఎంసీ) ఇటీవల రద్దు చేసిన మెడికల్‌ సీట్ల విషయంలో వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎన్‌ఎంఆర్, టీఆర్‌ఆర్, మహావీర్‌ మెడికల్‌ కళాశాలల్లో సీట్లను ఎన్‌ఎంసీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ కాలేజీల్లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు ఇతర మెడికల్‌ కళాశాలల్లో సీట్లు కేటాయించాలని ఎన్‌ఎంసీ ఆదేశించినా వరంగల్‌ కాళోజీ ఆరోగ్య వర్సిటీ పట్టించుకోకపోవడంతో మూడు కళాశాలల విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం ఆరోగ్య వర్సిటీ ఎదుట వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

తమకు వెంటనే సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కాగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను లోపలికి అనుమ తించకుండా పోలీసులు యూనివర్సిటీ గేటు ఎదు టనే అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా వైద్యవిద్యార్థులు మాట్లాడుతూ ఆరోగ్య వర్సిటీ అ«ధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు.

దీనిపై వర్సిటీ అధికారులు మాట్లాడు తూ ఎన్‌ఎంసీ ఆదేశాలు ఇవ్వడం సబబుగానే ఉందని, అయితే ఇక్కడ 450 మంది ఎంబీబీఎస్‌ విద్యా ర్థులు, 111 మంది పీజీ విద్యార్థులు ఉన్నారని, ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులను సర్దుబాటు చేయ డం కష్టమన్నారు. భవిష్యత్‌లో సాంకేతికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సీట్లను సర్దుబాటు చేస్తున్నామని ప్రత్యేక జీఓ తెస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు.

మరిన్ని వార్తలు