ఇన్‌స్టాలో ఐఫోన్‌ అగ్గువ.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న నిట్‌ విద్యార్థిని

8 Feb, 2023 19:16 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్‌ లభిస్తుందని వచ్చిన ఓ ప్రకటన చూసి అత్యాశకు పోయిన ఓ నిట్‌ విద్యార్థి రూ.42,497 నగదు పోగొట్టుకుంది. విద్యార్థిని తన ఫోన్‌లో ఇన్‌స్టా యాప్‌ చూస్తుండగా ఐఫోన్, డెల్‌ ఐ–5 ల్యాప్‌టాప్‌ తక్కువ ధరకు ఉందనే ప్రకటన చూసి ఆర్డర్‌ పెట్టింది. వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ల్యాప్‌టాప్‌ లేదని, వన్‌ ప్లస్‌ మొబైల్‌ ఉందని చెప్పగా.. రూ.42,497 నగదును ఆమె ట్రాన్స్‌ఫర్‌ చేసింది. రోజులు గడుస్తున్నా ఫోన్‌ రాకపోవడంతో ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా అవతలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని కాజీపేట పోలీసులను ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్‌ గట్ల మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు.

రూ. 34 వేలు పోగొట్టుకున్న చిరు వ్యాపారి..
హనుమకొండ విజయపాల్‌ కాలనీకి చెందిన చిరువ్యాపారి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి రూ.34 వేలు పోగొట్టుకున్నాడు. నిట్‌ వరంగల్‌ కలాం విశ్రాంతి గృహానికి బిస్లరీ వాటర్‌ బాటిళ్లు పంపించాలని గుర్తు తెలియని వ్యక్తి చిరువ్యాపారికి ఫోన్‌ చేశాడు. బాటిళ్లను ఎన్‌ఐటీకి తీసుకెళ్లగా ఆర్డర్‌ ఇచ్చిన వ్యక్తి అక్కడ లేడు. దీంతో వ్యాపారి ఫోన్‌ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తి రూ.20 నగదు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

రూ.34వేలు పంపిస్తే రూ. 68 వేలు పంపిస్తానని మాయమాటలు చెప్పాడు. చిరువ్యాపారి రూ.34 వేలు పంపించాడు. ఆతర్వాత అవతలి వ్యక్తి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించిన బాధితుడు కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు.   
చదవండి: లైట్‌ తీస్కోవద్దు.. నాకేమవుతుందనుకుంటే ప్రమాదమే, తస్మాత్‌ జాగ్రత్త!

మరిన్ని వార్తలు