ట్రాన్స్‌జెండర్లకు ఆరోగ్యమస్తు.. తొలిసారిగా వారి కోసం ఎంజీఎంలో ప్రత్యేక క్లినిక్‌

2 Aug, 2022 03:10 IST|Sakshi

రాష్ట్రంలోనే తొలిసారిగా వారి కోసం ఎంజీఎంలో ప్రత్యేక క్లినిక్‌ 

సాక్షి, వరంగల్‌: ట్రాన్స్‌జెండర్లను సమాజం నేటికీ చిన్నచూపు చూస్తోంది. రీ అసైన్‌మెంట్‌ సర్జరీ కారణంగా తరచూ అనారోగ్యం బారినపడుతున్నప్పటికీ వైద్యం పొందడంలోనూ అడుగడుగునా వారికి వివక్ష ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్లకు ఎదురవుతున్న శారీరక, మానసిక సమస్యలకు చికిత్స అందించేందుకు వరంగల్‌లోని మహత్మాగాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆస్పత్రి ముందుకొచ్చింది.

రాష్ట్రంలోనే తొలిసారిగా వారి కోసం ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గోపి ఈ క్లినిక్‌ను మంగళవారం ప్రారంభించనున్నారు. ఎంజీఎంలోని 133, 134 ఓపీ రూమ్‌లలో ప్రతి మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాన్స్‌జెండర్లకు ఎంజీఎం ఆస్పత్రి వైద్య సేవలు అందించనుంది.

సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌తోపాటు హర్మోనల్‌ థెరపీ, సెక్స్‌ రీ అసైన్‌మెంట్‌ సర్జరీ, బ్రెస్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్, మ్యాస్టెక్టమీ, హిస్టరెక్టమీ, ప్లాస్టిక్‌ సర్జరీ, చర్మవ్యాధులు వంటి వాటికి స్పెషలిస్ట్‌ వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా తమిళనాడులో ఈ సేవలు అందుతుండగా రాష్ట్రంలో మాత్రం ఎంజీఎం సొంతంగా మొదలు పెడుతోంది. 

హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు... 
ఎంజీఎంలో వారానికోరోజే ఈ క్లినిక్‌లో ఓపీ సేవ లు అందనున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చే ట్రాన్స్‌జెండర్లు ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఆస్పత్రి యాజమాన్యం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 99631 64111ను ఏర్పాటు చేసింది. ఈ నంబర్‌కు ఫోన్‌చేసి పేరు, అనారోగ్య సమస్య చెబితే క్లినిక్‌ పనివేళల సమాచారం చెబుతారు. ఓపీ సేవ ల్లో ఎస్‌టీఐ కౌన్సిలర్‌ కీర్తి సతీశ్‌కుమార్, తెలంగా ణ ట్రాన్స్‌జెండర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, కమ్యూనిటీ మొబిలైజర్‌ పూర్ణిమారెడ్డి చేదోడువాదోడుగా ఉండనున్నారు. 

సంపూర్ణ వైద్యసేవలు అందుతాయి..
ఇప్పటికే హెచ్‌ఐవీ పాజిటివ్‌ ట్రాన్స్‌జెండర్లకు యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ, ఇతర వైద్యసేవలు అందిస్తున్నాం. ఇప్పుడు ఈ క్లినిక్‌తో వారికి సంపూర్ణ వైద్యసేవలు అందినట్టవుతాయి. ఇందుకోసం మా సిబ్బంది కృషి చేస్తారు. 
– వి.చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్‌  

మరిన్ని వార్తలు