బాబాయితో వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి హత్య

6 Mar, 2022 08:27 IST|Sakshi

ఖమ్మం (తల్లాడ) : కన్నూమిన్ను కానక బాబాయి వరుసయ్యే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి గొడవలు జరుగుతుండడంతో అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హతమార్చింది. కానీ తనపై వేధింపులు తాళలేక హత్య చేసినట్లు పోలీసులను ఏమార్చాలని చూసినా విచారణలో అసలు విషయం బయటపడింది.

వైరా సీఐ వసంత్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. గతనెల 26న కుర్నవల్లి దళితకాలనీలో ఇనుపనూరి జయరాజు హత్య జరిగింది. ఆయన్ను భార్య నిరోషా రోకలిబండతో కొట్టి చంపినట్లుగా అంగీకరించింది. మద్యం మత్తులో తనను వేధిస్తుండడంతో హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. కానీ, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా నిరోషాకు వరుసకు బాబాయి అయ్యే కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన మాడుగుల కృష్ణతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది.

ఈ క్రమంలోనే నిరోషా, కృష్ణ కలిసి ఉండగా మద్యం మత్తులో ఉన్న జయరాజు ఈనెల 26న చూశాడు. దీంతో ఆయన గొడవ పడుతుండగా కృష్ణ తన్నడంతో కింద పడిపోయాడు. ఆ వెంటనే నిరోషా రోకలి బండతో భర్తను కొట్టి స్పృహ తప్పాక కృష్ణ గట్టిగా కాళ్లు పట్టుకున్నారు. ఆ తర్వాత నిరోషా దుప్పటితో జయరాజు నోటిని అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేశారు. ఈ విషయాలన్నీ విచారణలతో తేలడంతో ఇద్దరినీ మధిర కోర్టులో హాజరుపర్చాక రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

మరిన్ని వార్తలు