'భర్తకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు'

9 Mar, 2021 09:09 IST|Sakshi

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో ఓ మహిళ తన భర్త కోసం అతడి ఇంటి ఎదుట చేస్తున్న దీక్ష మహిళ దినోత్సవం నాటికి 41వ రోజుకు చేరింది. వివరాల్లోకి వెళ్తే కాలనీలో నివాసం ఉండే పైడి నవీన్‌తో వేములవాడకు చెందిన అరుణకు 2017లో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో కట్నం భారీగానే ఇచ్చారు. ఆర్నెళ్ల తర్వాత అదనపు కట్నం కోసం వేధింపుల మొదలయ్యాయి. ఈ క్రమంలో పలుసార్లు గొడవలు జరిగాయి. దాంతో అరుణ తల్లిగారింటి వద్ద కొన్ని రోజులుగా ఉంటోంది. మామ సురేందర్‌ తనకు పిల్లలు పుట్టరని వదంతులు సృష్టించి తన భర్తకు మరో పెళ్లి చేయాలనే కుట్ర చేయడంతో అడ్డుకున్నానని తెలిపింది.

ఇంటికి వచ్చి తన భర్త తనకు కావాలని ఇంటి ఎదుట ధర్నా ప్రారంభించి ఇప్పటికి 41 రోజులు పూర్తయింది. విడాకుల ఇవ్వాలని మధ్యవర్తుల ద్వారా ఒత్తిడులు ఎదురవుతున్నప్పటికీ ఆమె ఇంటి ఎదుట నుంచి కదలడం లేదు. ధర్నాను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు భర్త కుటుంబీకులెవరు ఇటువైపు రాలేదు. అయినా అరుణ ఇంటి ముందు నుంచి కదలడం లేదు. ఎవరు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతుంది. తన భర్తతోనే కాపురం చేస్తానని చెబుతోంది.  

మరిన్ని వార్తలు