ఇద్దరు పిల్లలతో కలిసి సికింద్రాబాద్‌లో రైలు ఎక్కింది.. చెన్నైలో దిగలేదు..

25 Feb, 2022 10:51 IST|Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: నగరం నుంచి చెన్నైకి రైలు ప్రయాణం ద్వారా వెళ్లాల్సిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నైలో ఉంటున్న లలిత (23), తన కుమారులు వీరా (07), ఆశిష్‌ (05)తో కొద్ది రోజుల క్రితం ఒక వివాహానికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చారు. తిరిగి చెన్నై వెళ్లేందుకు ఈ నెల 22న ఉప్పుగూడ నుంచి ఆటోలో లలిత తన తల్లి కమ్లి ఇద్దరు పిల్లలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.

లలిత, ఆమె పిల్లలను చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైలు (ఎస్‌4–34) బోగీలో ఎక్కించిన కమ్లి సెండాఫ్‌ చేసి ఉప్పుగూడకు వెళ్లిపోయింది. మరుసటి రోజు చెన్నైలో దిగాల్సిన లలిత ఆమె పిల్లలు కనిపించకుండా పోయారు. లలిత ఆమె పిల్లలు అదృశ్యమయ్యారన్న సమాచారాన్ని ఆమె భర్త హరి ద్వారా తెలుపుకున్న ఆమె కుటుంబ సభ్యులు పలు చోట్ల వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ కూడా స్వచ్చాఫ్‌ రావడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లలిత ఆమె పిల్లల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ!

మరిన్ని వార్తలు