ఫోన్‌లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు... 

20 Apr, 2022 08:51 IST|Sakshi
అదృశ్యమైన మంగమ్మ, సువర్ణ, స్వప్న  

సాక్షి, బంజారాహిల్స్‌: నెల రోజులుగా తన భార్య ఫోన్‌లో విపరీతంగా మాట్లాడుతుండటాన్ని గమనించి మందలించడంతో పాటు కొట్టానని ఇందుకు అలిగి తన భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని అనుమానాస్పదంగా అదృశ్యమైందంటూ బాధితుడు ఎల్లప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని తల్లీ, పిల్లల కోసం గాలింపు చేపట్టారు. వివరాలివీ... మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లప్ప భార్య మంగమ్మ అలియాస్‌ పద్మ, కూతుళ్లు సువర్ణ, స్వప్నలతో కలిసి రహ్మత్‌నగర్‌ వీడియో గల్లీలో అద్దెకుంటున్నారు.

భార్య పద్మ యూసుఫ్‌గూడ చౌరస్తాలోని ఉడుపి హోటల్‌లో పని చేస్తున్నది. ఎప్పటిలాగే ఈ నెల 6న డ్యూటీకి వెళ్లింది. రాత్రి ఇంటికి వచ్చి చూడగా భార్యా, పిల్లలు కనిపించలేదు. దీంతో ఉడిపి హోటల్‌కు వెళ్లి ఆరా తీయగా పద్మ తన పిల్లలతో కలిసి మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పిందని వెల్లడించారు. దీంతో స్వగ్రామంతో పాటు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తన భార్య, పిల్లలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్‌: 62813 86209లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్‌ పలకరింపు

మరిన్ని వార్తలు