భర్తతో గొడవలు.. అతడితో ఫేస్‌బుక్‌లో లవ్‌ట్రాక్‌.. చివరకు.. 

14 Nov, 2022 13:13 IST|Sakshi

బాన్సువాడ టౌన్‌(బాన్సువాడ): ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో ఓ వివాహిత మోసపోవడమే కాకుండా దారుణ హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణంలోని గౌలీగూడలో నివాసముంటున్న ముఖీద్‌కు నిజామాబాద్‌కు చెందిన ఉస్మా బేగం(32)కు 18ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లులున్నారు. పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. 

నిజామాబాద్‌లోనే ఉన్న ఉస్మాబేగం ఇటీవల బాన్సువాడలోని భర్త ఇంటికి వచ్చింది. ఇటీవల ఆమెకు ఫేస్‌బుక్‌లో యూపీకి చెందిన షెహజాద్‌ అనే యువకుడు పరిచయమవగా.. ఇద్దరిమధ్య ప్రేమ మొదలైంది. ఈ క్రమంలో ఉస్మాబేగం ప్రియుడి సూచన మేరకు బాన్సువాడ నుంచి యూపీలోని గజరౌలాకు చేరింది. షెహజాద్‌ను కలుసుకున్న ఉస్మాబేగం పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. 

దీంతో, షెహజాద్‌ ఆమెను కట్టేసి ఇటుకతో తలపై చితకబాదాడు. ఆమె మృతిచెందడంతో ఓ కంపెనీ ఆవరణలో మృతదేహాన్ని పడేసివెళ్లిపోయాడు. కంపెనీ ఆవరణలో మహిళ మృతిదేహం ఉన్నట్లు గుర్తించిన గజరౌలా పోలీసులు కంపెనీలో పని చేసే షెహజాద్‌ను విచారించారు. దీంతో అతడు ఫేస్‌బుక్‌ ప్రేమకథ బయటపెట్టాడు. అక్కడి పోలీసులు నిజామాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈనెల 6న తన భార్య కనిపించడం లేదని ముఖీద్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు మృతురాలి కుటుంబీకులు యూపీకి వెళ్లారు.    
 

మరిన్ని వార్తలు