HYD: ప్రేమ పేరుతో సహజీవనం.. రూ. 8 లక్షలు తీసుకొని మరో యువతితో పెళ్లి

12 Feb, 2023 16:20 IST|Sakshi
నిందితుడు స్నేహిత్‌ ప్రణయ్‌ రాజ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడు. అనంతరం ఉపాధి వెతుక్కుంటానని రూ. 8 లక్షలు తీసుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకొని మోసగించారు. ఘటనలో ఘరానా మోసగాడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు.

వివరాలివీ... హయత్‌నగర్‌ సమీపంలో ప్రైవేట్‌ హాస్టల్‌ నడుపుతున్న కాశీ స్నేహిత్‌ ప్రణయ్‌ రాజ్‌కు 2011లో యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లుగా సహజీవనం చేశాడు. బోరబండలో జవహర్‌నగర్‌లో గదులు అద్దెకు తీసుకొని ఆమెతో సహజీవనం చేసిన సమయంలోనే తాను వ్యాపారం చేస్తానని ఆమె వద్ద నుంచి దశల వారిగా రూ. 8 లక్షల వరకు వసూలు చేశాడు.

పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేయడమే కాకుండా గతేడాది ఆగస్టు 20న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తన మాటేమిటని ప్రశ్నిస్తే ఫోన్‌ బ్లాక్‌ చేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి నాలుగు నెలలుగా తిరిగినా అది తమ పరిధి కాదంటూ పట్టించుకోకపోవడంతో షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. అక్కడి పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 376, 420 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: విధి ఆడిన వింత నాటకం.. కొత్త జంట అకాల మరణం

మరిన్ని వార్తలు