పిల్లలతో సహా జూరాల కాల్వలో దూకిన మహిళ 

7 Feb, 2022 03:22 IST|Sakshi

పెబ్బేరు: కుటుంబ కలహాలతో ఓ వివాహిత, ముగ్గురు పిల్లలతో కలిసి జూరాల కాల్వలో దూకిన సంఘటన ఆదివారం రాత్రి వనపర్తి జిల్లా పెబ్బేరులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పెబ్బేరు పట్టణానికి చెందిన తెలుగు వాకిటి స్వామి, భవ్య ఏడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు జ్ఞానేశ్వరి (5), నిహారిక (1), కుమారుడు వరుణ్‌ (4) ఉన్నారు. వివాహం జరిగిన కొన్నేళ్లు సంతోషం గా ఉన్న భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరి గాయి.

ఈ నేపథ్యంలో తరచూ గొడవ పడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన భవ్య (30) ఆదివారం రాత్రి వనపర్తి రోడ్డు మార్గంలోని జూరాల ప్రధాన కాల్వలో ముగ్గురు పిల్లలతో కలిసి దూకింది. గమనించిన స్థానికులు వెంటనే వరుణ్‌ను కాపాడారు. తల్లి, ఇద్దరు అమ్మాయిలు కాల్వలో గల్లంతవడంతో పోలీసులకు సమాచారం అందించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రామస్వామి తెలిపారు.

మరిన్ని వార్తలు