Secunderabad Railway Station: రైలెక్కుతూ పడిపోయిన మహిళ.. వైరల్‌ వీడియో

31 Jul, 2021 18:23 IST|Sakshi

రైలు ఎక్కుతూ కింద పడిన మహిళ.. కాపాడిన రైల్వే కానిస్టేబుల్

సాక్షి, హైదరాబాద్‌: హడావిడిగా కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో జారిపోయి, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వేగంగా స్పందించి ఆ మహిళను వెనక్కిలాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ దినేష్‌ సింగ్‌ను ప్రశంసిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన  వీడియోను సౌత్‌ సెంట్రల్‌  రైల్వే ట్వీట్‌ చేసింది. 

సికింద్రాబాద్‌ రైల్వె స్టేషన్‌ నుంచి బయలు దేరుతున్న ఎమ్‌ఎమ్‌ఆర్‌ స్పెషల్‌ రైలు ఎక్కేందుకు నసిమా బేగం అనే మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే అదే సమయంలో రైలు కదలినప్పటికీ, పరుగున వెళ్లి ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టు కోల్పోయి  ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో పడబోయింది. అయితే అక్కడే విధుల్లో ఉన్న దినేష్‌ ఆమెను  ప్లాట్‌ఫాం మీదకు లాగేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

మరోవైపు రైలులో ఉన్నవారు చైన్‌ లాగడంతో రైలు ఐదు నిమిషాల పాటు నిలిచిపోయింది. ఆ  మహిళను క్షేమంగా తిరిగి రైలు ఎక్కించారు. నసిమాను కాపాడిన కానిస్టేబుల్‌ను  తోటి ప్రయాణీకులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలాగే సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడారంటూ సౌత్ సెంట్రల్ రైల్వే కూడా దినేష్‌ను అభినందించింది. 

మరిన్ని వార్తలు