భర్త ఇంటికి లేటుగా వచ్చాడని.. బాత్‌రూమ్‌లోకి వెళ్లి యాసిడ్‌..

20 Dec, 2022 08:15 IST|Sakshi

సాక్షి, పటాన్‌చెరు టౌన్‌: భర్త ఇంటికి లేటుగా వచ్చాడని మనస్తాపం చెందిన భార్య యాసిడ్‌ తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామనాయుడు వివరాల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం గాజిపూర్‌ జిల్లాకు చెందిన రవీంద్ర, భార్య అంజులదేవి(28)తో కలిసి బతుకుదెరువు నిమిత్తం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఓ కిరాణ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ నెల 18న రవీంద్ర ఇంట్లో టిఫిన్‌ తినకుండా షాపుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తతో అంజుల దేవి మధ్యాహ్న భోజనానికి ఎందుకు రాలేదని అరుస్తూ బాత్‌రూమ్‌లోకి వెళ్లి యాసిడ్‌ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు పటాన్‌చెరులో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

చేర్యాలలో..
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మండలం ఆకునూరులో ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోయిని శేఖర్‌(32) ఈ నెల 15న పురుగుల మంది తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య కావ్య ప్రస్తుతం 5నెలల గర్భిణి. కాగా మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు