పంట పొలాల మధ్య ఫార్మా వద్దు.. 

10 Nov, 2021 01:07 IST|Sakshi
ఎమ్మెల్యే కాళ్లు మొక్కుతున్న మహిళ   

ఎమ్మెల్యే కాళ్లు మొక్కి వేడుకున్న మహిళలు   

నర్సాపూర్‌ రూరల్‌: పచ్చని పంట పొలాల మధ్య ఫార్మా చిచ్చు వద్దంటూ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట మహిళలు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి కాళ్లు మొక్కి మొర పెట్టుకున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే, ఇన్‌చార్జి ఆర్డీఓ సాయిరాం గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫార్మా కంపెనీ వద్దంటూ ముక్తకంఠంతో చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమ నోట్లో మట్టి కొట్టొద్దని కోరారు.

ఈ కంపెనీలతో చుట్టూ పంట పొలాలు, గ్రామాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములను ఫార్మా కంపెనీ యాజమాన్యం తప్పుడు సర్వే చేయించి లాక్కున్నదని కొందరు దళితులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని ఆపేయిస్తానని హామీ ఇవ్వాలని గ్రామస్తులు పట్టుబట్టడంతో మంత్రి, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పారు. 

మరిన్ని వార్తలు