'నీ చెల్లిని కాపురానికి పంపిస్తే ఇంట్లోకి రానిస్తా'

15 Dec, 2020 16:49 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : భార్య బతికి ఉండగానే ఆమె చెల్లిపై కన్నేశాడు ఒక ప్రబుద్దుడు. అంతటితో ఆగకుండా ఆమె చెల్లిని బలవంతంగా పెళ్లి చేసుకొని భార్య సహా తన నలుగురు పిల్లలను ఇంట్లో నుంచి గెంటేశాడు. చెల్లిని కాపురానికి పంపిస్తేనే ఇంట్లోకి అనుమతిస్తానని చెప్పాడు. భర్త మాటలు నమ్మి చెల్లిని తీసుకువచ్చిన భార్యకు మరో షాక్‌ తగిలింది. వీరిద్దరిని కాదని మరో మహిళను వివాహం చేసుకొని కాపురం చేస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన మహిళ, తన చెల్లి, నలుగురు పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలంటూ అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె చేస్తున్న నిరసనకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ది చేశారు. ఈ ఘటన నిజామాబాద్‌లోని విద్యుత్‌ నగర్‌ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. 

వివరాలు.. ఆర్మూర్ మండలం మగ్గిడికి చెందిన హారికకు.. నిజామాబాద్ విద్యుత్ నగర్ కు చెందిన గల్ఫ్ ఏజెంట్ కృష్ణ కు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా నలుగురు పిల్లలు పుట్టాక హారిక చెల్లెలిపై కన్నేసిన కృష్ణ ఆమెను బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు తన చెల్లితో పాటు మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడని హారిక ఆరోపించింది. తన చెల్లిని కాపురానికి పంపిస్తే ఇంట్లోకి రానిస్తానని చెప్పిన కృష్ణ ఇప్పుడు మాట మార్చి ఇంట్లోంచి గెంటేశారని కన్నీటి పర్యంతం అయ్యింది. హారికతో పాటు ఆమె చెల్లి కూడా అక్క ఆందోళనకు మద్దతు తెలుపుతూ కృష్ణ ఇంటిముందు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు