21 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు 

14 Feb, 2023 01:44 IST|Sakshi
 బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలకు  పూజలు చేస్తున్న ప్రధానార్చకులు  

వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహణ 

ఆహ్వాన పత్రిక ముద్రించి పూజలు చేసిన ఆచార్యులు

28న జరిగే శ్రీస్వామివారి కల్యాణానికి రానున్న సీఎం?

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తరువాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలకు ఆలయ ఆచార్యులతో అధికారులు సోమవారం పూజలు చేయించారు.  

బ్రహ్మోత్సవాలలో జరిగే పూజా కార్యక్రమాలు ఇవీ.. 
►21వ తేదీ ఉదయం 10గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహన జరిపిస్తారు.  
►22న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం. 
►23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకా రం చుడతారు. ఉదయం 9గంటలకు మత్సా్యవతార అలంకార సేవ, వేదపారాయణం. రాత్రి 7గంటలకు శేష వాహన సేవ ఉంటుంది. 
►24న ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7గంటలకు హంస వాహన సేవ. 
►25న ఉదయం 9గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ. రాత్రి 7గంటలకు పొన్న వాహన సేవ. 
►26న ఉదయం 9గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7గంటలకు సింహ వాహన సేవ. 
►27న ఉదయం 9గంటలకు జగన్మోహిని అలంకా ర సేవ. రాత్రి 7గంటలకు అశ్వవాహన సేవ, అ నంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం.
►28న ఉదయం 9గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ. రాత్రి 8గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం.  
►మార్చి 1వ తేదీన ఉదయం 9గంటలకు గరుడ వాహన సేవ. రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం.  
►2వ తేదీన ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం. సాయంత్రం 6గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన. 
►3వ తేదీన ఉదయం 10గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తి అవుతాయి. 

ఉత్తర మాడవీధిలో కల్యాణం.. 
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో తిరు కల్యాణ వేడుకను నిర్వహించనున్నట్లు అధికారులు ఆహ్వాన పత్రికలో తెలియజేశారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని అధికారులు కోరుతున్నారు.  

కల్యాణానికి సీఎం వచ్చే అవకాశం 
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 28వ తేదీన రాత్రి శ్రీ స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం జరగనుంది. ఈ కల్యాణ వేడుకకు ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆ రోజు ఉదయం సీఎం కేసీఆర్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఆలయ అధికారులు, అర్చకులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వనున్నారు. 

మరిన్ని వార్తలు