CM KCR Health Condition: సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన

11 Mar, 2022 14:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు రోజులుగా సీఎం కేసీఆర్‌ నీరసంగా ఉన్నారని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎడమ చేయి లాగుతున్నట్లుగా ఉందని కేసీఆర్‌ చెప్పారని పేర్కొన్నారు. ఈ ఉదయం కేసీఆర్‌ కాల్‌ చేసి సమస్య వివరించారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసుకోవాలని సూచించగా సీఎం ఒప్పుకున్నారన్నారు. ఆయనకు తొలుత ఈసీజీ, ఆ తర్వాత 2డి ఎకో పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.

చదవండి: CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత!

ఈసీజీ, 2డి ఎకో పరీక్షల్లో అంతా నార్మల్‌గా ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. ఎందుకైనా మంచిదని యాంజియోగ్రామ్‌ చేశామన్నారు. ఆ పరీక్షల్లో ఎలాంటి బ్లాక్‌ లేదని తేలిందన్నారు. ఎడమ చేయి ఎందుకు లాగుతుందన్న కారణంగా ఎంఆర్‌ఐ చేశామన్నారు. మెడకు సంబంధించి ఎంఆర్‌ఐ, అలాగే బ్రెయిన్‌ ఎంఆర్‌ఐ కూడా చేశామని యశోద  వైద్యులు వెల్లడించారు.

‘‘షుగర్, బీపీ పరీక్షలు కూడా చేశాం. కంట్రోల్‌లో ఉండడానికి సూచనలిచ్చాం. ప్రస్తుతానికి పెద్ద సమస్య ఏం లేదు. వారం పాటు విశ్రాంతి సూచించాం. సర్వికల్‌ స్పెన్‌ ఎంఆర్‌ఐలో కొంత రూట్‌ నర్వ్‌ పెయిన్‌ ఉన్నట్లు గమనించామన్నారు. వారం రోజుల విశ్రాంతితో సీఎం కేసీఆర్ నార్మల్‌ అవుతారని’’ వైద్యులు వెల్లడించారు.

సీఎం కేసీఆర్‌ డిశ్చార్జి
యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్‌ డిశ్చార్జి అయ్యారు. ఆయన ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్‌కు వైద్యులు సూచించారు.

మరిన్ని వార్తలు