Drugs: నిషా ముక్త్‌ షహరే.. డ్రగ్‌ ఫ్రీ సిటీ దిశగా!

24 Dec, 2022 10:54 IST|Sakshi

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పడిన హెచ్‌–న్యూ

ఇప్పటి వరకు 86 కేసులు, 1109 మంది అరెస్టు 

రూ. 2.3 కోట్ల విలువైన మాదకద్రవ్యాల సీజ్‌

డిసెంబర్‌ 31’ నేపథ్యంలో నిఘా ముమ్మరం

సాక్షి, సిటీబ్యూరో: నిషా ముక్త్‌ షహరే లక్ష్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటైన హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ), నార్కోటిక్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ విజన్‌ వింగ్‌ (ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ) తమ మార్కు చూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 9న వీటికి రూపమిచ్చారు.  
నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్స్‌ కోసం ఏర్పాటైన ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ స్ఫూర్తితో... వాటి మాదిరిగా ఏకైక లక్ష్యంగా ఈ రెండు విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. మాదకద్రవ్యాల మూలాల నుంచి రవాణా, విక్రయం, వినియోగంపై నిఘా ఉంచి దాడులు చేసేందుకు హెచ్‌–న్యూ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి కేసు విచారణ పూర్తయ్యే వరకు పర్యవేక్షించేందుకు ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ ఉపకరిస్తున్నాయి. 
హెచ్‌–న్యూ టాస్‌్కఫోర్స్‌ మాదిరిగా పని చేస్తోంది. ఇది కేవలం మాదకద్రవ్యాల వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షిస్తోంది. యుక్త వయస్సులో, కాలేజీ రోజుల్లో స్నేహితుల బలవంతంతోనే, తమకు ఉన్న ఉత్సుకత నేపథ్యంలోనే అనేక మంది సరదాగా డ్రగ్స్‌ వాడటం మొదలెడుతున్నారు. ఆపై వాటిని బానిసలుగా మారి జీవితాలను నిరీ్వర్యం చేసుకుంటున్నారు. ఎందరో యువత ఈ మహమ్మారికి సంబంధించిన ఛట్రంలో ఇరుక్కుంటున్నారని హెచ్‌–న్యూ అధికారులు గుర్తించారు. 
ఒకప్పుడు కేవలం డ్రగ్స్‌ సరఫరాదారులు, విక్రేతలను మాత్రమే అరెస్టు చేసేవాళ్లు. అయితే తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు వీరితో పాటు వినియోగదారుల పైనా చర్యలకు ఉపక్రమించారు. 
ఎన్డీపీఎస్‌ యాక్ట్‌లో ఉన్న సెక్షన్ల ప్రకారం పదేపదే వాడుతున్న వారినీ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో కలిసి రీహాబిటేషన్‌ విధానానికీ శ్రీకారం చుట్టారు. డిసెంబర్‌ 31 రాత్రి జరిగే పారీ్టల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం జరిగే అవకాశం ఉంది. 
ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా హెచ్‌–న్యూ నిఘా ముమ్మరం చేసింది. దీనికోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గతంలో ఈ కేసుల్లో అరెస్టు అయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వారిని నిశితంగా గమనిస్తున్నాయి.
చదవండి: TS: సంక్షేమ శాఖల్లో 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

మరిన్ని వార్తలు