బరిగీసి.. బండ లాగి..

12 Feb, 2023 20:40 IST|Sakshi

ఏనుగులను తలపించే బలమైన కాడెద్దులు.. వాటి మెడలోని కాడికి క్వింటాళ్ల కొద్దీ బరువుండే బండరాళ్లు.. బండను లాగడానికి గిత్తలను సంసిద్ధం చేయడానికి చెర్నకోలాలను పట్టుకొని హడావుడి చేసే ట్రైనర్లు.. పందెపుటెడ్ల చూట్టూ చేరి ఈలలు, కేరింతలతో ప్రేక్షకులు చేసే సందడి.. ఏ గిత్తలు గెలుస్తాయో అనే ఆత్రుత, ఉత్కంఠ. శివరాత్రి వచ్చిందంటే.. దేవాలయాల వద్ద నిర్వహించే సంప్రదాయపు ఎండ్ల పందేల వద్ద కనిపించే దృశ్యాలు ఇవీ..

(సాక్షి, నల్లగొండ డెస్క్‌) : పోట్ల గిత్తలు సత్తా చూపేందుకు బరిలు సిద్ధమవుతున్నాయి. ప్రతియేటా శివరాత్రి సందర్భంగా పలుచోట్ల జాతరల వద్ద జరిగే పోటీలకు గిత్తలు రెడీ అవుతున్నాయి. ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతానికే పరిమితమైన ఎడ్ల పందేలపై ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సైతం పలువురు రైతులు ఉత్సుకత చూపుతున్నారు. లక్షల రూపాయల ఖర్చుకు కూడా వెనుకాడకుండా గిత్తలను పెంచుతున్నారు. ఎడ్ల పందేల్లో గెలుపు ఇచ్చే కిక్‌ కోసం పోటీలు ఉన్న ప్రతి చోటుకూ వెళ్తున్నారు. తమ పోట్ల గిత్తలను కన్న బిడ్డలకన్నా మిన్నగా పెంచుకుంటున్నారు. గిత్తలను పెంచడం, వాటని పోటీలకు తీసుకెళ్లడం, అవి గెలుపొందడం తమ స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు. తమ గిత్తలను బరిలోకి దింపి విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గిత్తలను పెంచడం కోసం వీరు చేస్తున్న ఖర్చులో సగం కూడా రాని పందెం డబ్బు కోసం కాకుండా.. పేరు, పరపతిగా భావించి పోటీల్లో పాల్గొంటున్నారు. 

ఎలా మొదలయ్యాయంటే..
వ్యవసాయంలో అన్నదాతలకు చేదోడు వాదోడుగా ఉండే ఎద్దులను రైతులు సొంత బిడ్డల్లా సాకుతారు. తాము పెంచే ఎద్దుల సామర్థ్యాన్ని చాటుకోవడం కోసం, ఎంత బలిష్టంగా ఉన్నాయో చెప్పుకోవడానికి గతంలో చిన్నచిన్న బండరాళ్లను, ఇసుక బస్తాలను కట్టి లాగించే వారు. ఇదే కాలక్రమేణ ఎడ్ల పందేలుగా మారింది. క్వింటాళ్ల కొద్దీ బరువుండే బండరాళ్లను లాగే పోట్ల గిత్తలను తయారు చేసి వాటికి బలమైన ఆహారాన్ని ఇస్తూ పోటీలకు సై అంటూ ముందుకు పోతున్నారు ఔత్సాహికులు.

రోజూ శిక్షణ
పందెపు గిత్తలను వ్యవసాయ పనులు చేయిసూ్తనే మరో పక్క వీటికి బండ లాగే పోటీలో శిక్షణ ఇస్తుంటారు. రోజూ తెల్లవారు జామునే షెడ్ల నుంచి బయటకు తీసుకొచ్చి దాదాపు కిలోమీటరు దూరం నడిపిస్తారు. కొంత దూరం ఉరికిస్తారు. పోటీల సీజన్‌లో మాత్రం వారంలో రెండు రోజులు వీటికి బండరాళ్లను కట్టి లాగిస్తూ ట్రెనింగ్‌ ఇస్తారు. మరో రెండు రోజులు టైర్‌బేటా వేస్తారు. దీని కోసం ప్రత్యేకంగా కొందరిని నియమిస్తారు. ఆ తరువాత బలమైన ఆహారం ఇస్తారు.

పోటీలు ఇలా..
ఎడ్ల పందేల్లో ముఖ్యమైనది వివిధ బరువులతో ఉండే బండరాళ్లను లాగడం. సాధారణంగా పోటీలకు నిర్వాహకులు రెండు రకాల బరులను సిద్ధం చేస్తారు. ఒకటి 200 అడుగులు, మరొకటి 300 అడుగుల పొడవు ఏర్పాటు చేస్తారు. 20 అడుగుల వెడల్పు ఉంటుంది. బరిలో ఒక వైపు నుంచి రెండవ వైపు వెళ్లి మళ్లీ మొదటి వైపునకు వస్తే ఒక రౌండ్‌ అంటారు. ఇలా నిర్ణీత సమయంలో ఎన్ని ఎక్కువ రౌండ్లు వేస్తే ఆ జత గెలిచినట్లుగా ప్రకటిస్తారు. పందేలు నిర్వహించే చోటు నుంచి దాదాపు 15 చానళ్లు లైవ్‌ ఇస్తాయి. పోటీల వీడియోలు కూడా అందుబాటులో ఉంచుతాయి.

దూడల ఎంపిక కీలకం
ఎడ్ల పందేలకు గిత్తలను తయారు చేయాలనుకునే వారు అవి దూడలుగా ఉన్న సమయంలోనే ఎంపిక చేసుకుంటారు. సాధారణంగా ఒంగోలు జాతి దూడలను ఎంచుకుంటారు. పోటీల్లో రాణించాలంటే గిత్తలకు ఎముక బలం ఎక్కువగా ఉండాలి. గంగడోలు, గిట్టలు, తోక పొడవు, చెవులు ఇలా ప్రతి లక్షణం చూసి దూడలను ఎంపిక చేసుకుంటారు. పాలు మరిచిన సమయంలోనే గ్రామాల్లో లేదా, పేరున్న సంతల్లో వీటిని కొనుగోలు చేస్తారు. పాలు మరిచిన దూడల ఖరీదు సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. ఇవి కొంచెం పెద్దవి కాగానే వాటిని వ్యవసాయ పనులకు సాగదీస్తారు. వ్యవసాయ పనులు చేస్తేనే గిత్తలు బలిష్టంగా ఎదుగుతాయని రైతులు భావిస్తారు.

ఖర్చు దండిగానే..
పందెపుటెడ్లను సాదాలంటే డబ్బులు దండిగానే ఉండాలి. జత గిత్తలకు రోజువారి దాణ, ఇతర ఖర్చులు కలిపి దాదాపు 2,400 వరకు అవుతాయి. దీంతో పాటు వీటి కోసం ఇద్దరు ట్రైనర్లు ఉండాలి. ఇలా జత పందెపుటెడ్ల ఖర్చు నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వస్తుంది. ఇలా పెంచిన ఎద్దులు పందేలకు వెళ్లి రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు ప్రైజ్‌మనీ గెలుచుకున్న సందర్భాలు ఉంటాయి. వీటిని పందెలు జరిగే ప్రదేశాలకు తరలించడానిక ప్రత్యేకంగా తయారు చేయించిన డీసీఎం వ్యాను కూడా ఏర్పాటు చేస్తారు. 

ఉమ్మడి జిల్లాలో ఎద్దుల పోటీలు 
జరిగే ప్రాంతాలు : మేళ్లచెర్వు, మఠంపల్లి, 
దొండపాడు, రఘునాథపాలెం, నక్కగూడెం, 
చింత్రియాల, రేబల్లె, వేపల మాదారం, కోదాడ, బేతవోలు, బట్టుగూడెం, రామన్నగూడెం, 
తిరుమలగిరి, కుంకుడుచెట్టుతండా. ఆయా గ్రామాల్లో జాతరల సందర్భంగా ఎద్దుల 
పోటీలు నిర్వహిస్తారు. మేళ్లచెర్వులో నిర్వహించే పందేలకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది.

అదిరిపోయే ఆహారం..
►గిత్తలకు పొద్దున్నే ఎండు ఖర్జూరా, అంజీరా తినిపిస్తారు. ఎండుగడ్డిని పెట్టి ఆ తరువాత శుభ్రమైన నీటితో కడుగుతారు. తడి ఆరిన తరువాత షెడ్లలోకి తీసుకువస్తారు. వేసవిలో వీటిని ఉదయం, సాయంత్రం నీటితో కడుగుతారు. 

► షెడ్లలోకి రాగానే ఉలవపిండి దాణాతో పాటు బీన్స్, బీట్‌రూట్, ఆపిల్‌ ముక్కలు చేసి పెడతారు. బాదం పప్పులను నానబెట్టి ముద్దగా చేసి తినిపిస్తారు. 

►మధ్యాహ్నం బార్లీ, రాగులు, కొర్రలతో చేసిన జావను తాగిస్తారు. సాయంత్రం మరోసారి ఉలవపిండి దాణా పెడతారు. ఇక ఉదయం నుంచి రాత్రి  వరకు ఎండు గడ్డి నిరంతరం వేస్తుంటారు. ఎండు జొన్న చొప్ప కూడా వేస్తారు. మధ్యాహ్నం పచ్చి జొన్నగడ్డి వేస్తారు.

 ►ఆరోగ్యంగా ఉండడానికి బలవర్థకర ఆహారంతో పాటు గిత్తలో బలం, గట్టిదనం కోసం మందులను ఇస్తుంటారు. వారాని రెండు సార్లు కాల్షియం సిరప్‌ను దాణాలో కలిపి ఇస్తారు. గిత్తల లివర్‌ ఆరోగ్యంగా ఉండడానికి వాటికి అప్పుడప్పుడు బ్రోటోన్‌ లిక్విడ్‌తో పాటు కొన్ని రకాల విటమిన్లను దాణాలో కలిపి ఇస్తారు. అంతే కాకుండా నెలకు రెండు సార్లు పశువైద్యుడి చేత  చెకప్‌ చేయిస్తారు. పెంపకందారులు ఎక్కువగా గిత్తలకు హోమియోపతి మందులు ఇస్తారు. ఈగలు, దోమలు రాకుండా నిరంతరం షెడ్లలో ఫ్యాన్లు తిరుగుతుంటాయి. గిత్తల విసర్జితాలను ఎప్పటికప్పుడు తొలగించి షెడ్లను శుభ్రం చేస్తుంటారు. గిత్తలు పడుకునేందుకు వీలుగా కింద మ్యాట్‌లు వేస్తారు.  

పోటీల్లో పాల్గొనడం సరదా..
తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎడ్ల పందాల్లో నా గిత్తలకు ప్రతి చోటా ప్రైజ్‌ వచ్చింది. నాకు ఎడ్ల పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి కలగడంతో 2014లో రెండు లక్షల రూపాయలకు ఒకటి చొప్పున రెండు ఎడ్లను కొనుగోలు చేశాను. తొమ్మిది çసంవత్సరాల్లో మూడు జతల పందెం ఎడ్లను సాకాను. వయస్సు పైబడడంతో రెండు జతలు అమ్మేశాను. ఇప్పుడు మూడో జతతో ఎడ్ల పందేలకు వెళ్తున్నా. వాటికి రోజూ వెయ్యి రూపాయల వరకు దాణా ఖర్చు అవుతుంది. ఉదయం బాదం పప్పు, ఉలవలు, రెండు లీటర్ల ఆవు పాలు, మధ్యాహ్నం, రాత్రి కూడా ఉలవలు, జొన్న లాంటి బలవర్థకమైన ఆహారం అందిస్తున్నా. ప్రస్తుతం ఉన్న ఎద్దులతో 18 క్వింటాళ్ల బండ రాయి(జూనియర్‌) లాగే పోటీలకు తీసుకెళ్తున్నా. పోటీల్లో గెలిస్తే వచ్చే ఆదాయం కోసం కాకుండా పాల్గొనడం ఒక సరదాగా మారింది.
– సంకూరి అనంతరాములు, సూరేపల్లి, నిడమనూరు మండలం

ఆదాయం కోసం కాదు.. పేరు కోసమే..
నేను 16 ఏళ్లుగా ఎద్దుల పోటీల్లో పాల్గొంటున్న. నల్లగొండతోపాటు ఖమ్మం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జరిగే ఎద్దుల పోటీల్లో పాల్గొన్నా. ఇప్పటి వరకు 200కు పైగా  బహుమతులు వచ్చాయి. పోటీల్లో పాల్గొనే ఎద్దులకు ప్రత్యేక ఆహారంతో పాటు తర్ఫీదు ఇవ్వాలి. అవి దూడగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చి తర్ఫీదు ఇస్తాం. మరికొని్నంటిని నేరుగా కొనుగోలు చేస్తుంటాం. ప్రస్తుతం నా వద్ద నాలుగు ఎద్దులు ఉన్నాయి. వీటి విలువ రూ.30 లక్షలకు పైగా ఉంటుంవొ. 60 సంవత్సరాలుగా మా ఇంట్లో పందెపు ఎద్దులు ఉండేవి. ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నా. ఎద్దుల పోషణ ఖర్చులకు.. వచ్చిన బహుమతులు, డబ్బులు ఏ మూలకూ సరిపోవు. వారసత్వంగా వస్తున్న పేరు నిలబడటం కోసమే ఎద్దుల పోటీలకు వెళ్తున్నాం.  
    – శ్రీనివాసరెడ్డి, రామలక్ష్మీపురం, కోదాడ మండలం 

చిన్నప్పటి నుంచి ఎద్దులు అంటే ఇష్టం
నేను స్వతహాగా జంతు ప్రేమికుడిని. అందులో ఎద్దులు అంటే చాలా ఇష్టం. మాది వ్యవసాయ కుటుంబం. మా తాత కాలం నుంచి మాకు పశుసంపద బాగా ఉండేది. ఎద్దులను బాగా చూసుకోవడం, బలిష్టంగా పెంచడం ఒక అలవాటుగా మారింది. నేను పోలీస్‌ శాఖలో చేరి దూరప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నా.. తరచుగా హుజూర్‌నగర్‌లోని వ్యవసాయాన్ని, ఎద్దులను చూసుకునేందుకు వస్తున్నా. పందెం గిత్తలను ప్రత్యేకంగా పోషిస్తున్నాం. పోటీలకు ఉపయోగపడే లక్షణాలున్న దూడలను కొనుగోలు చేసి వాటిని పత్య్రేకంగా పెంచుతాం. వాటిని నిరంతరం చూసుకునేందుకు వర్కర్లను పెట్టాను. 2007 సంవత్సరం నుంచి ఎద్దుల పోటీల్లో పాల్గొంటున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, కర్నాటకలోనూ జరిగిన పోటీల్లో మా గిత్తలు పాల్గొన్నాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణతో పాటు రాయచూర్‌లో పోటీలకు వెళ్తున్నాయి. అనేక చోట్ల బహుమతులు పొందాయి. 
– సురేందర్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ, జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 

మరిన్ని వార్తలు