మీ ఫోన్‌ పోయిందా?.. వెంటనే ఇలా బ్లాక్ చేసుకోండి.. అన్నీ సేఫ్‌..!

1 Apr, 2023 02:28 IST|Sakshi

కేంద్రం తెచ్చిన సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ను బ్లాక్‌ చేసుకొనే వీలు 

తద్వారా ఫోన్‌లోని డేటా దుర్వినియోగం కాకుండా నియంత్రించే అవకాశం 

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు ఏ దశలో ఉందో కూడా తెలుసుకోవచ్చు 

ఫోన్‌ దొరికాక అన్‌బ్లాక్‌ చేసుకొనే వెసులుబాటు 

తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన సేవలు 

సాక్షి, హైదరాబాద్‌: మీ ఫోన్‌ ఈమధ్యే చోరీకి గురైందా? లేక ఎక్కడైనా పోగొట్టుకున్నారా? అందులోని డేటా దుర్వినియోగం కావొచ్చని ఆందోళన చెందుతున్నారా? ఇకపై మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆ ముప్పు నుంచి మనల్ని బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ను అందుబాటులోకి తెచి్చంది. దీని సాయంతో పోయిన లేదా చోరీకి గురైన ఫోన్‌ను ఇతరులు వాడకుండా మీరు బ్లాక్‌ చేయొచ్చు. 

ఎలా ఉపయోగించాలంటే.. 
మనం మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న వెంటనే కేంద్ర టెలికమ్యూనికేషన్‌ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీఈఐఆర్‌ పోర్టల్‌లోకి వెళ్లి దాన్ని బ్లాక్‌ చేయవచ్చు. అంటే మన ఫోన్‌ ఇతరుల చేతుల్లోకి వెళ్లినా అది పనిచేయకుండా మనం నియంత్రించవచ్చన్నమాట. దీంతోపాటు పోగొట్టుకున్న ఫోన్‌కు సంబంధించి పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్‌ దొరికాక అన్‌బ్లాక్‌ సైతం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు పొందాలంటే ముందుగా కొన్ని వివరాలు తెలియజేయాలి. మీ మొబైల్‌ నంబర్, ఐఎంఈఐ నంబర్, మొబైల్‌ కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్‌తోపాటు మీ సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కాపీని సీఈఐఆర్‌ పోర్టల్‌లో జత చేయాలి. వివరాలన్నీ అప్‌లోడ్‌ చేస్తే సీఈఐఆర్‌ సెంట్రల్‌ డేటాబేస్‌లో అప్పటికే నమోదై ఉన్న సదరు ఫోన్‌ పనిచేయకుండా బ్లాక్‌ లిస్ట్‌లో పెడతారు. మన ఫిర్యాదు స్థితిని తెలుసుకొనే ఆప్షన్‌ సైతం ఈ పోర్టల్‌లో ఉంది. 

మార్చి 15 నుంచి అమల్లోకి..
వాస్తవానికి సీఈఐఆర్‌ సేవలను కేంద్ర ప్రభుత్వం 2019 చివర్లోనే ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచి్చంది. తొలుత కొన్ని రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించి అక్కడ విజయవంతం అయ్యాక దశలవారీగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ వస్తోంది. మార్చి 15 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ సీఈఐఆర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్స్‌ శాఖ వెల్లడించింది. మార్చి 15 తర్వాత పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లకు సంబంధించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. 
పోలీసు సిబ్బంది 

ఈ సేవలు వాడాలి: డీజీపీ
మొబైల్‌ఫోన్‌ చోరీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు చోరీ అయిన సెల్‌ఫోన్లను గుర్తించేందుకు సీఈఐఆర్‌ సేవలను వినియోగించుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ తాజాగా ఆదేశించారు. ఇందుకోసం ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఒక పోలీసు అధికారిని నోడల్‌ అధికారిగా నియమిస్తామని... మరో 10 రోజుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు.
చదవండి: బీఆర్‌ఎస్‌ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా: సుఖేశ్‌ చంద్రశేఖర్‌

మరిన్ని వార్తలు