రెండేళ్లుగా ప్రేమ.. 9 రోజుల క్రితం పెళ్లి.. రక్షణ కల్పించండి

16 Jul, 2021 08:23 IST|Sakshi

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

కామేపల్లి: ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం కామేపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. పింజరమడుగు గ్రామానికి చెందిన కర్రి దేవా, తాళ్లగూడెంకు చెందిన బండారి కావ్యలు డిగ్రీ చదువుతున్నారు. వీరు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కావ్యకు తల్లిదండ్రులు వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తుండగా గత తొమ్మిది రోజుల కిందట ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుని..గురువారం కామేపల్లి ఠాణాకు వచ్చారు.

'మా కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉంది.. మమ్మల్ని కాపాడండి' అని ఫిర్యాదు చేశారు. కాగా  ఎస్సై జి.స్రవంతి ప్రేమజంటకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మేజర్లు కావడం, విడిపోడానికి ఇష్టపడకపోవడంతో కావ్యను  అబ్బాయి దేవా కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామపెద్దలు వీరిద్దరికీ తాళ్లగూడెం ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేశారు. 

మరిన్ని వార్తలు