షాద్నగర్ రూరల్: రైల్వేగేటు పడటంతో సకాలంలో ఆస్పత్రికి తరలించలేక ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన శ్రీశైలం (33)కు శుక్రవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం షాద్నగర్కు తీసుకొస్తుండగా.. మార్గమధ్యలో చటాన్పల్లి వద్ద రైల్వే గేటు పడటంతో వారి వాహనం ఆగిపోయింది.
దీంతో వారు షాద్నగర్ శివారు బైపాస్ నుంచి అన్నారం వై జంక్షన్ మీదుగా చుట్టూ తిరిగి షాద్నగర్కు తీసుకొచ్చారు. ఆస్పత్రికి చేరు కునేలోపే శ్రీశైలం మృతి చెందాడు. రైల్వే గేటు ప్రాణం తీసిందంటూ వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మరొకరికి ప్రాణనష్టం జరగకముందే రైల్వేగేట్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.