ఎంతో ఇష్టంతో ప్రేమించి పెళ్లి చేసుకుంది.. రెండు రోజులకే ఇలా జరుగుతుందనుకోలేదు!

4 Jan, 2023 11:39 IST|Sakshi

మనోహరాబాద్‌(తూప్రాన్‌): ప్రేమించాడు..పెళ్లి చేసుకున్నాడు.. రెండురోజులకే ఇద్దరి కులాలు వేరంటూ వదిలేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ యువతి వేడుకున్నా కనికరించలేదు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. నెల రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో మృతురాలు కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని ఆ యువకుడి ఇంటి వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. ఈ విషాద ఘటన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. తుప్రాన్‌ మండలపరిధిలోని ధర్మరాజ్‌పల్లి గ్రామానికి చెందిన యశ్వంత్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన బాషబోయిన తేజశ్రీ (18)లు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. గతేడాది అక్టోబర్‌ 15న  పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్‌ 19న పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు కాపురం చేసుకుంటామని ఒప్పుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో విభేదాలు వచ్చాయి. యువతికి అండగా కులపెద్దలు  ఉండి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినా ఎలాంటి న్యాయం జరగలేదు. 

దీంతో, ఆ యువతి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. నెల రోజులుగా చికిత్స పొందుతున్న తేజశ్రీ మంగళవారం వేకువజామున మృతి చెందింది. తేజశ్రీ మృతదేహాన్ని యశ్వంత్‌రెడ్డి ఇంటివద్ద ఉంచి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ శ్రీధర్, ఎస్‌ఐ సందీప్‌రెడ్డిలు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజె ప్పారు. పోలీసులు చివరికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి అంత్యక్రియలు చేశారు. 

మరిన్ని వార్తలు