రంగారెడ్డిలో యువతి కిడ్నాప్‌ కలకలం.. సినిమా స్టైల్లో 100 మందితో వచ్చి

9 Dec, 2022 15:26 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి:  రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో యువతి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్న గూడలో ఓ యువతి కిడ్నాప్‌గు గురైంది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. దుండగులను అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులు, పక్కింటి వ్యక్తులకు గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు తెలిపారు. యువతని కిడ్నాప్ చేసింది టీ టైం ఓనర్‌ నవీన్‌ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. 100 మంది యువకులు తన కూతురు వైశాలిని కిడ్నాప్‌ చేసినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది. నవీన్ రెడ్డి, వైశాలి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అయినా పెళ్లి చేసుకోమని నవీన్‌ పదే పదే యువతి వెంటపడుతున్నాడు. శుక్రవారం రోజు వివాహ సంబంధం కోసం మరో పెళ్లివారు వైశాలి ఇంటికి వస్తున్నారని ముందే పసిగట్టి నవీన్ రెడ్డీ అమ్మయి ఇంటి దగ్గరికి వందకుపైగా గుండాలతో వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేశాడు. దీనిపై కేసు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య

మరిన్ని వార్తలు