యూత్‌ కాంగ్రెస్‌ నేతపై దాడి.. రేవంత్‌ యాత్ర ముగిసిన కొద్దిసేపటికే..

21 Feb, 2023 03:47 IST|Sakshi

వరంగల్‌ : హనుమకొండలో సోమవారం రాత్రి కాంగ్రెస్‌ యువజన నాయకుడు తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా బహిరంగసభ ముగిసిన కొన్ని నిమిషాలకే సభావేదికకు వంద మీటర్ల దూరంలోనే ఈ దాడి జరిగింది. ముక్కు, కుడి కన్ను భాగంలో బలమైన గాయాలయ్యాయి. వీపుపై వాతలు తేలాయి.

రక్తపుమడుగులో ఉన్న పవన్‌ను స్థానికులు గమనించి హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. డీసీసీ నేత నాయిని రాజేందర్‌రెడ్డి ఆస్పత్రి వద్ద మాట్లాడుతూ పవన్‌పై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించారు.

ప్లకార్డులతో నిరసన..: రేవంత్‌రెడ్డి యాత్ర సమయంలో హనుమకొండలోని బాలసముద్రం అంబేడ్కర్‌ కాలనీలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను పేదలకు పంచాలని తోట పవన్‌ డిమాండ్‌ చేస్తూ స్థానికులతో కలిసి ప్రదర్శన చేపట్టారు. ఆ తరువాత రేవంత్‌ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఆ సభ ముగియగానే ఈ దాడి జరిగింది. 

మరిన్ని వార్తలు