లాఠీచార్జి అంటూ ప్రచారం: యూట్యూబ్‌ చానల్‌పై కేసు

22 Apr, 2021 07:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాత్రి కర్ఫూ నేపథ్యంలో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారని, ఉల్లంఘించిన వారిపై వాటిని ఝుళిపిస్తున్నారంటూ తప్పుడు వార్త ప్రసారం చేసిన ఓ ప్రైవేట్‌ యూట్యూబ్‌ చానల్‌పై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు చానల్‌ ‘వీపు చింతపండు చేస్తున్న పోలీసులు’ పేరుతో ఓ వార్తాంశాన్ని రూపొందించి ప్రసారం చేసింది. ఇది సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వేర్వేరు ప్రాంతాల్లో, భిన్న సందర్భాల్లో చిత్రీకరించిన వీడియోలను ఎడిట్‌ చేసి, మంగళవారం రాత్రి నాటివిగా ఈ చానల్‌ ప్రసారం చేసిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఇది పోలీసులను నైతికంగా దెబ్బతీసేలా ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ చట్టంతో పాటు ఇతర చట్టాల కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వార్తాంశానికి బాధ్యుడైన రిపోర్టర్‌ను అరెస్టు చేయాల్సిందిగా కొత్వాల్‌ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఈ తరహా ప్రసారాలను ఉపేక్షించమని అధికారులు స్పష్టం చేశారు.
చదవండి: భర్త వదిలేశాడు.. తండ్రి,కుమారుల మృతి ఆవేదనతో
 

మరిన్ని వార్తలు