పాలేరు నుంచి పోటీ: వైఎస్‌ షర్మిల వెల్లడి

25 Mar, 2021 04:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి తాను పోటీ చేస్తానని వైఎస్‌ షర్మిల వెల్లడించారు. బుధవారం ఆమె లోటస్‌ పాండ్‌లోని తన కార్యాలయంలో ఆ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌ అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌ సానుభూతిపరులు మాట్లాడుతూ.. అధికార పక్షంతో ఎదురవుతున్న ఇబ్బం దులను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజన్న సంక్షేమ పాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా మీరు వేసే అడుగులో అడుగు వేస్తామని చెప్పారు.

షర్మిల మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగేనని, పాలేరు నుంచే బరిలోకి దిగుతానని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరని చెప్పారు. ఏప్రిల్‌ 9న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ విధి విధానాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. సభకు పోలీసు అనుమతులు సైతం లభించి నట్లు షర్మిల తెలిపారు. సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌ అభిమానులను కోరారు.  

మరిన్ని వార్తలు