రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష

16 Apr, 2021 12:58 IST|Sakshi

వైఎస్ షర్మిలకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ వైఎస్‌ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం వైఎస్‌ షర్మిలకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇందిరాపార్క్‌ వద్ద గురువారం ఆమె దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ దీక్ష కొనసాగించడానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో లోటస్‌పాండ్‌ వద్ద దీక్ష కొనసాగించేందుకు వైఎస్‌ షర్మిల ధర్నా చౌక్‌ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్‌కే భవన్‌ వద్ద పోలీసులు ఆమెను మరోసారి అడ్డుకున్నారు.

ప్రత్యేక వాహనంలో ఆమెను తరలించే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడం, పోలీసులు కొంత దురుసుగా వ్యవహరించడంతో ఒక దశలో వైఎస్‌ షర్మిల స్పృహతప్పి పడిపోయారు. దుస్తులు స్వల్పంగా చిరిగిపోవడంతో పాటు ఎడమ చేతికి గాయమైంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాదయాత్ర చేస్తూ లోటస్‌పాండ్‌కు చేరుకున్న వైఎస్‌ షర్మిల దీక్షను కొనసాగిస్తున్నారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతినబూనారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.


చదవండి:
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి: వైఎస్‌ షర్మిల 
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

మరిన్ని వార్తలు