సాక్షి, హైదరాబాద్/ మహబూబాబాద్/ గూడూరు: పోడు భూముల కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల పోరు చేయనున్నారు. ఈ నెల 18న ములుగు జిల్లాలో ‘పోడు భూములకై పోరు’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ములుగు లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం పస్రాలోని కు మురం భీం విగ్రహానికి నివాళి అర్పించి, లింగాల వరకు భారీ ర్యాలీ చేపట్టి పోడు భూములకై పోరును నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ రాజగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, షర్మిల మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగిలో నిరుద్యోగ దీక్ష చేపట్టన్నారు. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న సో మ్లాతండావాసి బోడ సునీల్ నాయక్ కుటుంబ సభ్యులను ముందుగా పరామర్శిస్తారు.
సునీల్ కుటుంబానికి బెదిరింపులు!
వైఎస్ షర్మిల పరామర్శించనున్న బోడ సునీల్ కుటుంబసభ్యులకు స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్నాయక్, పోలీసుల నుంచి బెదిరింపులు వచ్చాయని సునీల్ సోదరుడు శ్రీనివాస్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు, పోలీసుల సాయంతో తమను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని.. తామంతా వేర్వేరు చోట్ల బంధువుల ఇళ్లలో తలదాచుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని షర్మిల దీక్షలో వెల్లడిస్తానని చెప్పారు.