వ్యవసాయాన్ని పండుగ చేస్తాం: వైఎస్‌ షర్మిల

11 Sep, 2022 03:10 IST|Sakshi

2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర

కొత్తకోట రూరల్‌: తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసి, వైఎస్సార్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద 2,000 కి.మీ. పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తకోట సమీపంలో పైలాన్‌ ఆవిష్కరించారు. అక్కడే నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొత్తకోట బహిరంగసభలో షర్మిల మాట్లాడుతూ రాజన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఐదేళ్ల పాలనలో ఏ రోజు ఆర్టీసీ, కరెంట్‌ చార్జీలు పెంచిన సందర్భాలు లేవన్నారు. ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. నీళ్ల నిరంజన్‌రెడ్డి పేరు పెట్టుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రజలకు కన్నీళ్లు మిగిలిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఈనెల 14న 24 గంటల దీక్ష చేపట్టనున్నట్లు షర్మిల ప్రకటించారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం వీళ్లకు పదవులొచ్చాయని, మహిళల పట్ల గౌరవం లేకుండా సిగ్గులేని మంత్రి నిరంజన్‌రెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారని విరుచుకుపడ్డారు. మహిళలను తల్లి, చెల్లి మాదిరిగా చూడాల్సిన మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడం సరికాదన్నారు. నిరంజన్‌రెడ్డికి వీధి కుక్కకు ఏం తేడా అని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రానికి షర్మిల వస్తే ప్రజలు బ్రహ్మరథం పడితే ఓర్చుకోలేక కడుపు మండి రాజశేఖర్‌రెడ్డిది రక్తచరిత్ర అని మాట్లాడుతున్న మంత్రికి సిగ్గుందా? అని దుయ్యబట్టారు. సభ సమయంలో వర్షం కురుస్తున్నా.. ప్రజల అభివాదంతో షర్మిల ప్రసంగాన్ని అలాగే కొనసాగించారు. 

షర్మిలను ఆశీర్వదించండి: వైఎస్‌ విజయమ్మ
రాజశేఖరరెడ్డి బిడ్డను మీ బిడ్డ అనుకొని ఆశీర్వదించండని, ఆయన కొనసాగించిన సంక్షేమ పథకాలను మళ్లీ కొనసా గాలంటే షర్మిల ముఖ్యమంత్రి అయితే సాధ్యమవుతుందని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ ఉద్యమాలు చేస్తే ప్రజల్లోకి దూసుకెళ్తున్న షర్మిలకు ప్రజలకు అండగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ప్రేమ: వైఎస్‌ షర్మిల

మరిన్ని వార్తలు