సాక్షి, హైదరాబాద్: ‘ఇంటింటికీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ కార్యక్రమాన్ని జూన్ 1 నుంచి ప్రారంభించాలని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు ప్రజాప్రస్థానం యాత్రను చేపట్టామని, ఇప్పుడు పార్టీని ప్రతి ఇంటికీ తీసుకువెళ్లాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈమేరకు గురువారం పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను అమలు చేస్తానని, ఉద్యోగ నోటిఫికేషన్లపైనే తొలి సంతకం చేసి నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తానని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామని, 108, 104 సర్వీసులను పునరుద్ధరిస్తామన్నారు.