రాష్ట్రపతి పాలనకు ఉమ్మడి పోరాటం 

3 Mar, 2023 02:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికారపక్ష దాష్టీకాలకు ముగింపు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అభిప్రాయపడ్డారు. ఇందుకు విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు బండి సంజయ్, రేవంత్‌ రెడ్డి, కోదండరాం, కాసాని జ్జానేశ్వర్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, అసదుద్దీన్‌ ఓవైసీ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, ఎన్‌ శంకర్‌ గౌడ్, మందక్రిష్ణ మాదిగలకు ఆమె లేఖలు రాశారు.

ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని విపక్ష నేతలకు వినమ్రంగా విన్నవించుకుంటున్నానని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఈ రోజున దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటోందనీ, నోరు విప్పితే పాలకులు కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ దారుణ హింసకు దిగుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజున నోరు తెరవటానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జెండాలను పక్కన పెట్టి, ఒక్కటై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె స్పష్టం చేశారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉందనీ. ఈ పరిస్థితుల్లో మనమంతా ఏకమై, ఒక గళంగా మారాలని పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు