Zika Virus In Telangana: తెలంగాణలో జికా వైరస్‌ కలకలం.. హెచ్చరించిన వైద్యులు

6 Jul, 2022 17:18 IST|Sakshi

దేశంలో కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్‌ టెన్షన్‌కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. 

ఐసీఎంఆర్‌, నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన అధ్యయనంలో.. జికా వైరస్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలకు వ్యాపించిందని పేర్కొంది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించబడింది. వీరి అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. 64 నమునాలు జికా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు చెప్పింది. ఇక, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జికా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది.

ఇదిలా ఉండగా.. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన ఒక నమూనాలో జీకా వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో కూడా ఈ కేసులు నమోదైనట్టు సమాచారం. మరోవైపు.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్, ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ బీఆర్‌ శమ్మన్నా స్పందించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు జీకా వైరస్‌ను గుర్తించడంపై దృష్టిపెట్టడం మొదలుపెట్టారని అధ్యయనంలో తేలిందని అన్నారు. జికా వైరస్‌పై అవగాహన పెరుగుతోందని చెప్పారు. ఇంతకు ముందు జికా వైరస్‌ గురించి అంతగా పట్టించుకోలేదన్నారు. ఇక, జీకా వైరస్ దోమలద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వైరస్‌ కారణంగా జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. కాగా, డెంగ్యూలాగే ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అమ్మో.. కోనోకార్పస్‌!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు

మరిన్ని వార్తలు