తిరుపతి అర్బన్ : స్పందనలో వచ్చే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డితోపాటు జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ, డీఆర్వో శ్రీనివాసరావు, స్పెషల్ కలెక్టర్లు కోదండరామిరెడ్డి, భాస్కర్నాయుడుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రతిఅర్జీని పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. మరోవైపు అ ర్జీలను అన్లైన్ చేయించడానికి ఇబ్బందులు లేకుండా తహసీల్దార్ కుప్పయ్యను ఏర్పాటు చేశారు.
స్పందనలో 50 శాతమే జిల్లా అధికారులు
స్పందన కార్యక్రమంలో 50 శాతం విభాగాలకు సంబంధించిన వారు మాత్రమే అధికారులు విచ్చేశారు. మరో 25 శాతం విభాగాలకు ద్వితీయశ్రేణి అధికారులు, 25శాతం విభాగాలకు తృతీయ శ్రేణి అధికారులు హాజరయ్యారు.
స్పందనకు 147 అర్జీలు
స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 147 అర్జీలు వచ్చాయి. వాటిలో 112 అర్జీలు ఒక్క రెవెన్యూశాఖకు చెందినవే ఉండడం గమనార్హం.