ఒకప్పుడు ఒంటింటి కుందేళ్లుగా పేరుగడించిన మహిళలు ఇప్పుడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. అవనిలో సగం.. ఆకాశంలో సగం.. అంటూ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమకు ఇష్టమైన రంగాలను ఎంచుకుని విశేషంగా రాణించేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు ప్రకృతిసేద్యం వైపు
మొగ్గుచూపుతు న్నారు. ఎలాంటి రసాయన అవశేషాలు లేని అమృత ఆహారాన్ని పండిస్తూ..
అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు. ఓ వైపు కుటుంబానికి అండగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరో వైపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ అబలలు కాదు.. సబలలమని నిరూపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పట్టభద్ర మహిళల వ్యవసాయ పద్ధతులు, పంటల రకాలు, కుటుంబ నేపథ్యం తదితరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి, తిరుపతి
వసుదైక కుటుంబానికి పసందైన వంటకాలు
పలమనేరు మండలం, మొరం గ్రామానికి చెందిన వరలక్ష్మి బీటెక్ పూర్తిచేశారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా ఆమె ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. వీరిది ఉమ్మడి కుటుంబం. పిల్లలు, పెద్దలు అంతా కలిపి 30 మంది వరకు ఉంటారు. సేద్యంపై ఉన్న మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేయాల ని నిర్ణయించారు. మొరం గ్రామంలో రెండెకరాల పొలంలో పది రకాల పంటలు సాగుచేయడం ప్రారంభించారు. ఆకు కూరలు, కూరగాయలతో పాటు మహాగణి మొక్కలు నాటారు. కూరగాయలు తమ కుటుంబానికే వినియోగించుకుంటుండగా.. మిగిలిన వాటిని గ్రామంలోనే విక్రయిస్తుంటారు.
వడమాలపేట మండలం, ఎస్బీఆర్పురానికి చెందిన శ్రీదేవి డిగ్రీ పూర్తిచేశారు. ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైనా కుంగిపోలేదు. తమకున్న ఏడెకరాల పొలంలో సేంద్రియ పద్ధతులతో మామిడి సాగుచేస్తున్నారు. మరో ఎకరం పొలం లీజుకు తీసుకుని అందులో టమాట, ఉల్లి, బెండ, వంగ, ముల్లంగి, పచ్చిమిర్చి, మొక్కజొన్న, వివిధ రకాల కూరగాయల సాగుచేస్తున్నారు. స్కూలు, అంగన్వాడీ పిల్లల మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే కూరగాయలను అందిస్తున్నారు. పిల్లల ఆరోగ్యానికి తమవంతు సహకారం అందిస్తున్నారు. వీరికి పోను మిగిలిన కూరగాయలను తిరుపతికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. భర్త ఇద్దరు పిల్లలతో హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు.